అధికార పార్టీ పేరుతో ఫైనాన్షియర్ల అరాచకం: నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాదారు
నగరంలోని సరూర్నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించలేదంటూ ఫైనాన్షియర్లు రెచ్చిపోయారు.
హైదరాబాద్: నగరంలోని సరూర్నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించలేదంటూ ఫైనాన్షియర్లు రెచ్చిపోయారు. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో జయశంకర్ అనే వ్యక్తిని ఫైనాన్షియర్లు దేవేందర్ రెడ్డి, జంగారెడ్డిలు నడిరోడ్డుపై చితకబాదారు.
తమ వద్ద తీసుకున్న డబ్బులకు వడ్డీ కట్టకపోవడంపై దూషిస్తూ.. చేతికి అందిన వాటితో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. బాధితుడి భార్య, తల్లి అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారిని తోసేసి చితకబాదారు. అక్కడేవున్న మరో ఇద్దరు వ్యక్తులు దాడిచేస్తున్న వారిని ఎంత వారించినా వినకుండా తీవ్రంగా కొట్టారు.
తాను ఫైనాన్షియర్ల వద్ద నుంచి రూ.2లక్షలు తీసుకున్నానని, అందుకు వడ్డీగా ఇప్పటికే రూ.3.50లక్షలు చెల్లించానని బాధితుడు తెలిపాడు. అసలు కూడా చెల్లిస్తానని చెప్పినా వినకుండా దాడి చేశారని వాపోయాడు. డబ్బులకు సంబంధించిన ఓ కేసు కోర్టులో ఉందని తెలిపాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి ఘటనపై ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
కాగా, దాడి చేసిన ఫైనాన్షియర్లు అధికార పార్టీ కార్పొరేటర్ అనిత, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అనుచరులమని చెప్పుకున్నట్లు తెలిసింది. రెండ్రో క్రితం భూ వివాదంలో ఓ వృద్ధుడిని కార్పొరేటర్ శ్యామల తండ్రి కరాటే రాజు, అతని అనుచరులు దాడికి దిగిన విషయం తెలిసిందే. వారి దాడిలో వృద్ధుడు రెండు కళ్లు కోల్పోయాడని తెలిసింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.