అధిక ఖర్చు, తప్పుడు డాక్యుమెంట్లు: హరీశ్వర్ పైన కేసు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి మాజీ శాసన సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి పైన పరిగి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
గత శాసన సభ ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్యే తుమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి ఈసీ నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఖర్చు చేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు హరీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వీరిద్దరు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు.
దీని పైన స్పందించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తాను అంత ఖర్చు చేయలేదని, అవన్నీ తప్పుడు నివేదికలు అని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన ఆరోపించారు.
ఇదే విషయం పేర్కొంటూ పరిగి కోర్టులో ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జడ్జి ఎంకే పద్మాపతి మంగళవారం పరిగి పోలీసులను ఆదేశించారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణ
పటాంచెరువు వద్ద టోల్ ప్లాజా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్టివ్ లిమిటెడ్ (పిసిఎల్) స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి టోల్ ప్లాజాకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, తమ పని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
పిసిఎల్ పటాంచెరువు నుంచి సంగారెడ్డి వరకు 36 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించింది. అనంతరం 'బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్సుఫర్' కింద 2012 నుంచి టోల్ ప్లాజా నిర్వహిస్తోంది. దీనిపై ఎమ్మెల్యే స్పందించవలసి ఉందని చెబుతున్నారు.