చర్లపల్లి హెచ్ పీసీఎల్ గ్యాస్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం, 6 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి..
నగరంలోని చర్లపల్లి హెచ్ పీసీఎల్ గ్యాస్ డిపోకు చెందిన గోడౌన్ లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్ లోని సిలిండర్లు పేలుతుండడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో పరుగులుతీశారు.
Recommended Video
హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని హెచ్పీసీఎల్ గ్యాస్ గోడౌన్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్ లోని సిలిండర్లు పేలుతుండడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు.
హెచ్ పీసీఎల్ గ్యాస్ డిపోలో పేలుడు శబ్దాలు కిలోమీటరు దూరం వరకు వినిపిస్తున్నాయి. ప్రమాదం కారణంగా గ్యాస్ డిపోలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్భంది ప్రమాద స్థలికి చేరుకున్నారు.
ఆరు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను వాకబు చేశారు.
మంటలు అదుపులోనే ఉన్నాయని, స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేయర్ పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా గ్యాస్ గోదాం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అక్కడ్నించి ఖాళీ చేయిస్తున్నారు.
అగ్నిప్రమాదం సమాచారం అందగానే ఫైర్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, సిబ్బంది రంగంలోకి దిగారు. ఎయిర్ పోర్టులోని మరో రెండు పెద్ద ఫైరింజన్లను కూడా ప్రమాద స్థలికి పంపించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ప్లాంట్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో గోదాంలో 800 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. సిలిండర్ల పేలుళ్లు తీవ్ర స్థాయిలో ఉండడంతో గోదాంకు చుట్టుపక్కల ఉన్న కంపెనీలు కూడా మూసివేశారు.
ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదం కారణంగా చర్లపల్లిలో తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు నానా తిప్పలు పడ్డారు.