వరంగల్ అగ్ని ప్రమాదం: మృతులు వీరే, సంఖ్య పెరిగే అవకాశం
వరంగల్: కోటిలింగాల వద్ద గల భద్రకాళీ ఫైర్వర్క్స్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11మంది మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. మృతుల్లో రాధిక, వినోద్, అశోక్, ఎల్లమ్మ, రఘుపతి, శ్రీవాణి, హరికృష్ణ, మణెమ్మలు ఉన్నారు. వీరంతా ఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు.
భద్రకాళీ ఫైర్వర్క్స్లో భారీ అగ్నిప్రమాదం: 11మంది సజీవదహనం, కేసీఆర్ దిగ్భ్రాంతి
కాగా, కొండకట్ల శ్రీదేవి(36) అనే మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ప్రమాద స్థలంలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన సురేష్, రవి, సారంగపాణి, శివలను ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాద సమయంలో గోదాంలో మొత్తం 25మంది ఉండగా, వీరిలో 8మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఫైర్ వర్క్స్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండానే ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.