హైద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం, ఎండీ సహా ఉద్యోగుల్ని కిటికీల గుండా దించారు
హైదరాబాద్: భాగ్యనగరంలోని నాంపల్లి రెడ్ హిల్స్ సింగరేణి భవన్లో సోమవారం సాయంత్రం భారి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వాటిని ఆర్పేందుకు ఫైరింజన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతోంది. పై అంతస్తులో చిక్కుకుపోయిన అధికారులను కిటికీల గుండా బయటకు దించారు. ఎండి శ్రీధర్ సహా పలువురిని కిటికీ నుండి బయటకు దించారు. ఈ మంటలతో పొగలు దట్టంగా అలుముకున్నాయి.
నష్టం జరగలేదు: సైఫాబాద్ ఏసీబీ
పొగ రావడంతో చాలామంది ఉద్యోగులు ఏదో ప్రమాదం జరుగుతుందని భావించి ముందే బయటకు వచ్చారని సైఫాబాద్ ఎసిపి చెప్పారు. ఉద్యోగులు అందరూ భవన్ నుంచి బయటకు వచ్చారని చెప్పారు. సెల్లార్లో చెత్త తగలబడటం వల్ల పొగ వచ్చిందని చెప్పారు. ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదన్నారు.
మంత్రి ఇంటిని ముట్టడించిన మహిళలు
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇంటిని మహిళలు ముట్టడించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని మంత్రి ఇంటి ముందు బైఠాయించి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్నికల సమయంలో తమ దగ్గరకు వచ్చి, తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గెలిచి, మంత్రి అయ్యాక ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని మహిళలు మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు మహిళలను సముదాయించి, మూడు రోజుల్లో సమస్యను పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు.