రబ్బర్ ఫ్యాక్టరీలో భారీగా ఎగిసిన మంటలు: భయంతో పరుగులు తీసిన జనం
హైదరాబాద్: నగరంలోని నాచారం మల్లాపూర్ పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రబ్బర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఆ ప్రాంతం నుంచి దూరంగా పరుగులు తీశారు. పరిశ్రమలో పలు సిలిండర్లు కూడా పేలడంతో మరింత మంటలు వ్యాపించినట్లు తెలిసింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
కాగా, ఆదివారం కావడంతో ఆ పరిశ్రమలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది? షాట్ సర్క్యూటా? లేక మరేదైనా కారణాలున్నాయా? అనేదానిపై విచారిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ.. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.