జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం: 8మందికి తీవ్రగాయాలు, 2కి.మీ మేర పొగలు
Recommended Video
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడ సుభాష్నగర్లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫార్మా కంపెనీ గోడౌన్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.
8మందికి తీవ్రగాయాలు
ఈ ప్రమాదంలో పరిశ్రమలో పనిచేస్తున్న 8 మంది కార్మికులకు తీవ్ర గాయలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
రెండు కిలోమీటర్ల మేర పొగలు
కాగా ఈ ప్రమాదం ధాటికి ఆ ప్రాంతం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల భారీగా పొగలు అలుముకున్నాయి. ఇంకొందరు కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు.
మంటలు అదుపులోకి
ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది అధికారులు స్పందిస్తూ ‘మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తం 8 వాహనాలతో కంట్రోల్ చేస్తున్నాం. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ మాత్రమే చేస్తున్నాం. ఐదుగురుని కాపాడి వారిని ఆస్పత్రికి తరలించాం. ప్రమాదానికి కారణాలపై తర్వాత వివరాలు అందిస్తాం. ప్రస్తుతం ఓ ట్రక్కు మంటలు మాత్రమే అదుపులోకి రావాల్సి ఉంది. అది ఓ అరగంటలో అదుపులోకి వస్తుంది. అందులో హెచ్సీఎల్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, అది పెద్ద ప్రమాదమేమి కాదు' అని వివరించారు.
ఫార్మా కంపెనీ నిర్లక్ష్యం..?
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్యూటిక్ ఫార్మా కంపెనీలో పలు లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రమాదం జరిగితే కనీసం మంటలను నియంత్రించేందుకు కూడా సరిపడా నీరు లేనట్లు తెలిసింది. అందులో పనిచేసే సిబ్బంది భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు కూడా కంపెనీ తీసుకోవడం లేదని పలువురు స్థానికులు ఆరోపించారు.