చరిత్ర సృష్టించిన నిమ్స్ వైద్యులు: తొలి కాలేయ మార్పిడి విజయవంతం
హైదరాబాద్: నిమ్స్ వైద్యులు మరోసారి చరిత్రను సృష్టించారు. తొలిసారి విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి, లివర్ కేన్సర్, సిరోసిస్తో బాధపడుతున్న రోగికి వైద్యులు ప్రాణదానం చేశారు. నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటల పాటు శ్రమించి ఆ రోగికి పునర్జన్మ ప్రసాదించారు.
కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య(61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఆయనకు తరచూ జ్వరం వస్తోంది. ఏడాది క్రితం కాళ్లు, చేతుల వాచిపోవడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఆసుపత్రిలో చూపించారు.
అక్కడి వైద్యులు నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్లో ఉండే అతడి పెద్ద కొడుకు వెంకటేశ్ నిమ్స్కు తీసుకొచ్చాడు. సత్యమయ్యకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు హెపటైటీస్ బీ, లివర్ సిరోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. కాలేయ మార్పిడి చేయాలని సూచించారు.
ఇటీవలే వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్డెడ్ అవడంతో అతడి కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆపరేషన్ ప్రారంభించిన ప్రొఫెసర్ బీరప్ప వైద్య బృందం 18 గంటలు శ్రమించి ఆపరేషన్ చేశారు.
ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని ప్రొఫెసర్ బీరప్ప చెప్పారు. ఇక ఆదివారం ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి నిమ్స్లో కాలేయ మార్పిడి చేయించుకున్న సత్యమయ్యను పరామర్శించారు. అనంతరం నిమ్స్ డైరెక్టర్ నరేంద్ర నాథ్, శస్త్రచికిత్స చేసిన డాక్టర్ల బృందంతో కలిసి మాట్లాడారు.