తెలంగాణలో తొలి కరోనా టీకా ఎవరికంటే... వ్యాక్సినేషన్పై కీలక వివరాలు వెల్లడించిన మంత్రి ఈటల...
తెలంగాణలో మొదటి కరోనా టీకాను సఫాయి కర్మచారికే వేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రానికి బుధవారం(జనవరి 13) 20 వేల కోవాగ్జిన్ డోసులు వచ్చినట్లు తెలిపారు. తొలి రోజు 139 సెంటర్లలో ఒక్కో సెంటర్లో 30 మందికి వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రి చెప్పారు. మొదట ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు, అనంతరం ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుండి కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈటల మీడియాతో మాట్లాడారు.
16వ తేదీ మరుసటి రోజు నుంచి రోజుకు 50, ఆ తర్వాత 100 చొప్పున... ఇలా అంచెల వారీగా వాక్సిన్ డోసులను పెంచనున్నట్లు ఈటల తెలిపారు. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని కోఠి నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు కరోనా వ్యాక్సిన్ను తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఇన్సులేటర్ వాహనాలు ఎస్కార్ట్ వాహనాలతో వెళ్లనున్నాయని వివరించారు.
వ్యాక్సినేషన్కు వచ్చేవారి అనుమతి, సంతకం తీసుకున్నాకే వారికి వ్యాక్సిన్ డోసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కాగా,కరోనా వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే కోవీషీల్డ్ టీకాలను ఆయా రాష్ట్రాలకు తరలించగా... తాజాగా కోవాగ్జిన్ టీకాలను కూడా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కోవాగ్జిన్ టీకాల తొలి బ్యాచ్ బుధవారమే ఢిల్లీకి చేరింది.
తొలి విడతలో దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియకు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టనుంది. వ్యాక్సిన్ తీసుకునేవారికి ఒక రోజు ముందుగానే వారి మొబైల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది. రెండు డోసుల విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. మొదటి డోసు ఇచ్చిన 14 రోజులకు మరో డోసును ఇస్తారు. కోవీషీల్డ్,కోవాగ్జిన్లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలన్న ఆప్షన్ కేంద్రం ఇవ్వలేదు. కాబట్టి వైద్యులు ఏ వ్యాక్సిన్ ఇచ్చినా తీసుకోవాల్సిందే.