ఉదయం హుషారు, మధ్యాహ్నం మందకొడిగా, సాయంత్రం బారులు : ఫస్ట్ ఫేజీ స్థానిక సమరం హైలెట్స్
హైదరాబాద్ : తెలంగాణలో తొలి విడత స్థానిక సమరం ప్రశాంతంగా ముగిసింది. 32 జిల్లాల్లో 2096 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ముగియిగా .. మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. నిర్దేశిత సమయం కన్నా ముందే పోలింగ్ కేంద్రాలకు వచ్చినవారికి ఓటేసే అవకాశం కల్పించారు.
జోరుగా హుషారుగా ..
తొలి విడత స్థానిక సమరం ఉదయం హుషారుగా జరిగింది. ఓటేసేందుకు వయోజనులు ఆసక్తి చూపించారు. అయితే ఎండల ప్రభావంతో మధ్యాహ్నాం పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. ఎండతగ్గడంతో సాయంత్రం పూట పోలింగ్ కేంద్రాలకు మళ్లీ ఓటేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 68.33 శాలం పోలింగ్ నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇంట్రెస్ట్ చూపిన ఓటర్లు ...
మావోయిస్టు ప్రభావిత ఐదు జిల్లాల్లో 75 జెడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలకు 70 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తమీద 75 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నారు
మరో రెండు విడతలు
తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికలు సోమవారం ముగిశాయి. రెండో విడత ఈనెల పదో తేదీన శుక్రవారం జరుగుతాయి. మూడో విడత 14వ తేదీన నిర్వహిస్తారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న ప్రకటిస్తారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మే 27 ఓట్లను లెక్కించి .. ఫలితాలను ప్రకటిస్తారు.