థర్డ్ ఫ్రంట్కు తొలి ప్రశ్న: ఎవరు నేత, కేసిఆర్ వర్సెస్ మమతా
Recommended Video
హైదరాబాద్: బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా మూడో కూటమి మాత్రం మళ్లీ తెర మీదికి వచ్చింది. దేశంలో మూడో కూటమి అవసరం ఉందని, అవసరమైతే తానే దానికి నాయకత్వం వహిస్తానని చెప్పడం ద్వారా దేశవ్యాప్తంగా ఓ కదలిక వచ్చింది.
ఆ రెండు పార్టీలకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రాంతీయ పార్టీలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీ తన దూకుడు పెంచారు.
థర్డ్ ఫ్రంట్కు తొలి ప్రశ్న ఇదే...
ఎవరు నాయకత్వం వహిస్తారనేది థర్డ్ ఫ్రంట్కు ఎదురయ్యే మొదటి ప్రశ్న. ఇప్పటికిప్పుడైతే కేసిఆర్ నాయకత్వం వహిస్తారా, మమతా బెనర్జీ నేతృత్వం వహిస్తారా అనేది ఎదురువుతున్న ప్రశ్న. కేసిఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి ప్రకటన చేసిన మరుక్షణమే మమతా బెనర్డీ చురుగ్గా కదులుతున్నారు.
స్టాలిన్తో దీదీ చర్చలు...
థర్డ్ ఫ్రంట్ తెర మీదికి రాగానే మమతా బెనర్జీ కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించడమే కాకుండా డిఎంకె నేత స్టాలిన్తో ఫోన్లో మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులతోనూ ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. తమ గురి ఎర్రకోటపైనే అని కూడా ఆమె ప్రకటించారు. సోమవారం ఆమె మాట్లాడిన తీరు చూస్తుంటే తానే థర్డ్ ఫ్రంట్కు నాయకత్వం వహించబోతున్నట్లు అనిపిస్తోంది.
అదేం లేదంటున్న నేతలు...
తానే థర్డ్ ఫ్రంట్కు నేతృత్వం వహించాలనే పట్టుదల మమతా బెనర్జీకి ఏమీ లేదని తృణమూల్ కాంగ్రెసు నాయకులు అంటున్నారు. దేశంలోని పలువురు నాయకులు ఆమెను సంప్రదిస్తున్నారని, ఆమె కూడా ఇతరులను సంప్రదిస్తున్నారని అంటున్నారు. పైగా, బిజెపిని గద్దె దించడానికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రస్తావన మొదటిసారి చేసింది దీదీయేనని కూడా చెబుతున్నారు.
కేసీఆర్తో ఇలా...
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన చేయగానే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మాట్లాడారు. అదే విధంగా ఛత్తీస్గడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కూడా కేసిఆర్తో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తేవడానికి జరిగే కృషికి తన మద్దతు ఉంటుందని చెప్పారు. భావసారూప్యం కిగిన నాయకులను ఫ్రంట్ కోసం కూడగట్టడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
కేసీఆర్అలా ఏమీ కాదని...
తానే నాయకత్వం వహించాలనే పట్టుదల కేసీఆర్కు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వర్గాలు అంటున్నాయి. ఎవరు నాయకత్వం వహిస్తారనేది సమస్య కాదని కూడా అంటున్నారు. కేసిఆర్ ఎవరితోనై కలిసి పనిచేయగలరని అంటున్నారు. అయితే, కేసిఆర్ మాత్రం దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.
భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
దేశంలోని ప్రధానమైన పార్టీల నాయకులందరితో కలిసి రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి కేసిఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా రాజకీయ సత్తాను చాటే విధంగా దాన్ని నిర్వహించాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ఢల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు తదితర నగరాల్లో పర్యటించి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశాలు నిర్వహించనున్నారు.