తెలంగాణలో తోలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు.. ఫలితాలు ఇస్తున్న ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ నగరంలోని సుభేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట గ్రామానికి చెందిన వ్యక్తి , యువతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. దీంతో అదృశ్యం కేసు తమపరిధి కాకపోయినా వ్యక్తి ఫిర్యాదుపై పోలీసులు కేసును నమోదు చేశారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్కు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కాగా పోలీసుల చర్యను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు.
తమ పరిధి కాదంటూ దిశ తల్లిదండ్రులను తిప్పిన పోలీసులు
దిశ సంఘటన తరువాత మహిళల భద్రత పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహిళలు తీసుకోవల్సిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహాన పెంచుతున్నారు. చట్టాలపై అవగాహాన లేకపోవడం వల్ల దిశ సంఘటన జరిగేందుకు అవకాశం ఏర్పడిందనే అభిప్రాయం ఉత్పన్నమవుతోంది. ఇదే సమయంలో సంఘటన జరిగిన తర్వాత దిశ తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళితే అది మా పరిధి కాదు అని శంషాబాద్ పరిధి అని, కాదు.. కాదు శంషాబాద్ రూరల్ పరిధి అనీ తిప్పారనే విమర్శ ఉంది. దీంతో సుమారు అర్థగంట పాటు పోలీస్స్టేషన్ల చుట్టు తిరిగిన పరిస్థితి తలెత్తింది. ఇలా తిరుగుతున్న నేపథ్యంలోనే దిశను నిందితులు అత్యాచారం చేసిన ప్రాంతం నుండి తరలించారు.
మహిళ రక్షణలపై ప్రచారం
ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళా భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా పోలీసు స్టేషన్ లిమిట్స్ గురించి పట్టించుకోకుండా.. జీరో ఎఫ్ఐఆర్ అమలు కూడ ప్రధానంగా తెరమీదకు వచ్చింది. దీంతో..ప్రతీ మహిళా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తమ ఫోన్లలో సేవ్ చేసుకోవాల్సిన నెంబర్లు.. వినియోగం..అప్రమత్తత.. సాయం..ఆపదలో బయటపడే విధానంతో పాటు ఆ సమయంలో ఏ పోలీసుస్టేషన్ పరిధిలోనైనా... జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేయవచ్చనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి
ఎదైన సంఘటన జరిగినప్పుడు బాధితులకు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధి తెలియకపోవచ్చు... దీంతో అందుబాటులో ఉన్న స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే అధికారం బాధితులకు ఉంది. దీంతో బాధితులు ఏ పోలిస్ స్టేషన్ కు వెళ్ళినా పోలీసులు తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. ఒకవేళ పోలీసులు మా పరిధి కాదు అని సమాధానం చెబితే జీరో ఎఫ్ఐఆర్ చేయమని అడిగే హక్కు ప్రజలకు ఉంది. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులే సంబంధిత పోలీస్స్టేషన్కు బదీలీ చేయాలి. కాని దీనిపై ప్రజలకు గాని, అటు క్రిందిస్థాయి పోలీసు అధికారులకు గాని పెద్దగా అవగాహన లేదు.