నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు , రేపు చేప ప్రసాదం పంపిణీ .. హైకోర్టు నుండి లైన్ క్లియర్
బత్తిని సోదరుల చేప మందు పంపిణీ నేడు సాయంత్రం 6గంటల నుండి ప్రారంభం అవుతుంది.హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు, రేపు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ సందర్భంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో ఒక్క మన రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకోనున్నారు.
చేప మందు పంపిణీకి సర్వం సిద్ధం .. ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
చేప మందు పంపిణీ కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. చేప మందు పంపిణీ చేసే నాంపల్లి గ్రౌండ్స్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఈ సందర్భంగా నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ విషయమై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పలు సూచనలు చేశారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా తాగు నీటికి, విద్యుత్ సరఫరాకి అంతారాయం లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. గత సంవత్సరం 70 వేల మందికి చేప మందు పంపిణీ జరిగింది. ఈ సారి అంతకంటే ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 10, 11 తేదీల్లో కూడా బత్తిని కుటుంబం ఇంటి వద్ద చేప ప్రసాదం ఇవ్వనున్నారు.
హైకోర్టులో చేప మందు పంపిణీ ఆపాలని పిల్
ఈ మందును బత్తిని సోదరులు పంపిణీ చేస్తారు.ముఖ్యంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇది దివ్య ఔషధంగా చెప్తారు. ప్రతి యేటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. అయితే ఇప్పుడు చేప ప్రసాదం పంపిణీ ఆపాలని కోర్టులో పిల్ వేసింది బాలల హక్కుల సంఘం. చేపమందు పంపిణీని నిలిపి వేయాలని , ఈ మందు చట్ట వ్యతిరేకమని , ఎటువంటి శాస్త్రీయ నిర్థారణ దీనికి లేదని , ఇటువంటి మందు పంపిణీ చేయడం నిషేధించాలని కోరింది. అంతే కాదు లక్షల్లో తరలి వచ్చే రోగులకు చేప మందు పంపిణీ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ ఏర్పాట్లు చేస్తోందని తన పిటీషన్ లో పేర్కొంది.
చేప ప్రసాదం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు .. పిటీషనర్ పై పలు ప్రశ్నలు సంధించిన కోర్టు
ఇటువంటి కార్యక్రమాలు ప్రజాధనాన్ని వృథా చేయడమేనన్నది వారి వాదన కానీ ఈ పిటీషన్ ను విచారించిన హై కోర్టు ప్రైవేట్ వ్యక్తులు చేసే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చెయ్యకూడదని చట్టం ఏమైనా ఉందా అంటూ పిటీషనర్ ను ప్రశ్నించింది. తొక్కిసలాట వంటివి జరగరానివి జరిగితే ఎవరైనా మృతి చెందితే తిరిగి ఇదే కోర్టుకు ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ వస్తారని , బాధితులకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారని పేర్కొంది. ప్రజలకు తాగునీరు, ఎండ వేడిమి తగలకుండా టెంట్లు, మరుగుదొడ్లు, అత్యవసర వైద్య ఏర్పాట్లు, పోలీసు రక్షణ కల్పించడాన్ని ఏ రకంగా తప్పుబట్టగలమని ప్రశ్నించింది . ఇలా చేయడం చట్ట విరుద్ధమని ఎక్కడుందో చూపాలని ప్రశ్నించింది. ఈ అంశంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ కేసుపై విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.