వాలెంటైన్స్ డే: షాపింగ్ మాల్స్లో విధ్వంసం: ఐదుగురు భజరంగ్ దళ కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే) సందర్భంగా నగరంలోని మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో విధ్వంసానికి పాల్పడిన ఐదుగురు భజరంగ్ దళ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నాగోత్ అజయ్ సింగ్, వదిత్య అర్జున్, గుడుపు పవన్ కుమార్, కొర్ర సంతోష్, పొలారి తిరుపతి ఉన్నారు.
ఫిబ్రవరి 14న భజరంగ్ దళ్ కార్యకర్తలు పదుల సంఖ్యలో ద్విచక్రవాహనాలపై నగరంలో చక్కర్లు కొట్టారు. కేపీహెచ్బీ నుంచి హైటెక్ సిటీ వెళ్లే దారిలో వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో పలు షాపింగ్ మాల్స్పై దాడులకు పాల్పడ్డారు. ఓ ఐస్ క్రీమ్ షాపులోనూ విధ్వంసం సృష్టించారు.
ఇనార్బిట్ మాల్స్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర షాపింగ్ మాల్స్లో దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఇనార్బిట్ మాల్ వద్దకు చేరుకోగానే వారంతా అక్కడ్నుంచి పరారయ్యారు. షాపింగ్ మాల్స్ యజమానుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. ఐదుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిని జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సుభాష్, దత్తసాయి, కిరణ్, సాయి రెడ్డి, వెంకట్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
కాగా, ప్రతీ సంవత్సరం కూడా వాలెంటైన్స్ వేడుకకు నిరసనగా భజరంగ్ దళ్ కార్యకర్తలు నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమ జంట కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామంటూ ప్రకటనలు కూడా పలువురు సభ్యులు ప్రకటనలు చేశారు. ఈసారి మాత్రం పలువురు భజరంగ్ దళ్ సభ్యులు.. ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిల్లు చేయమని.. దేశభక్తిపై కౌన్సిలింగ్ ఇస్తామని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.