ఘోర ప్రమాదం: టాటా ఏస్-లారీ ఢీ, ఐదుగురు మృతి
సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగిఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం పాములపర్తికి చెందిన కొంత మంది చేర్యాల సమీపంలోని ఓ గ్రామంలో బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు.
గజ్వేల్ జిల్లా రిమ్మనగూడకు చేరిన తర్వాత మరి కొంత మంది బంధువుల కోసం వేచి చూస్తూ రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపేశారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన లారీ టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కిందపడిన కొంత మందిని తొక్కుకుంటూ వెళ్లి కాస్త దూరంలో ఆగిపోయింది లారీ. తెగిపడిన శరీర భాగాలు, రక్తంతో ఘటనా స్థలి భయానకంగా మారింది.
ప్రమాదం జరిగినప్పుడు టాటా ఏస్ వాహనంలో మొత్తం 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది. లారీ టైర్ల కింద నలిగి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మరణించాడు. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలిస్తున్నారు.
హరీశ్ రావు దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై మంత్రి హరీష్రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలు అందించేందుకు నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడినట్లు తెలిపారు.