కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ.. రాజాసింగ్, అక్బరుద్దీన్ సహా ఐదుగురు మిస్..!
హైదరాబాద్ : రెండోసారి తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మ ద్ ఖాన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. 119 మందికి గాను 114 మంది సభ్యులే ప్రమాణం చేశారు. గోషామహల్ నుంచి బీజేపీ తరపున గెలిచిన రాజాసింగ్, చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం తరపున గెలిచిన అక్బరుద్దీన్ సహా ఐదుగురు సభ్యులు ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు.
నిండుగా సభ.. ఆ ఐదుగురు తప్ప
తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వచ్చాయి. అయితే అప్పటినుంచి మంత్రివర్గ విస్తరణ గానీ, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం గానీ జరగలేదు. వివిధ కారణాలతో అవి ఆలస్యమవుతూ వచ్చాయి. మంత్రివర్గ విస్తరణ ఇంతవరకు కొలిక్కిరాకున్నా.. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి మాత్రం లైన్ క్లియరయింది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఆ ప్రక్రియ ముగిసింది. అదలావుంటే బీజేపీ నుంచి ఒకే ఒక్కడిగా గెలిచి రికార్డు సృష్టించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా అసెంబ్లీకి రాలేదు. అలాగే జాఫర్ హుస్సేన్, సండ్ర వెంకటవీరయ్య, మాధవరం కృష్ణారావు కూడా గైర్హాజరయ్యారు.
రాజాసింగ్, అక్బరుద్దీన్.. ఆ ఇద్దరికీ ఏమైంది?
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గెలిచి నెల రోజులు దాటినా ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. ఇక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల యాంగ్జైటీ చెప్పనక్కర్లేదు. అదలావుంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరిస్థితి వేరు. ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు పట్టం కట్టడమే ఆయన ఆగ్రహానికి కారణం. ముంతాజ్ ఎదుట ఎమ్మెల్యేగా తాను ప్రమాణం చేయబోను అనేది ఆయన శపథం. దీనికి సంబంధించి ఈనెల 6న ఓ వీడియోను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రాజాసింగ్. అయితే స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఖరారు కావడంతో ఆయన అధ్యక్షతన రాజాసింగ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక చాంద్రాయణ గుట్ట నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేగా గెలిచిన అక్బరుద్దీన్ సభకు రాకపోవడం విస్మయానికి గురిచేసింది. టీఆర్ఎస్ తో పరోక్ష పొత్తు కొనసాగించడమే గాకుండా ఎంఐఎం పార్టీకి చెందిన నేతకే ప్రొటెం స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చినప్పటికీ.. అక్బరుద్దీన్ సభకు ఎందుకు రాలేకపోయారనే గుసగుసలు వినిపించాయి. అయితే ఆయన అనారోగ్య కారణాలతో సభకు రాలేకపోయారు. లండన్ లో చికిత్స తీసుకుంటుండటంతో రావడానికి వీలుపడలేదు. ఇక మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య, జాఫర్ హుస్సేన్ వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి రాలేకపోయారని సమాచారం.
అధ్యక్షా..! 23 మందికి కొత్త
ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. శాసనసభలో మొత్తం 120 మంది సభ్యులుంటారు. అందులో 119 మంది ప్రజాతీర్పుతో ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. ఆంగ్లో ఇండియన్ కోటాలో ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. ఓటుకు నోటు కేసులో టీఆర్ఎస్ కు అండగా నిలిచిన స్టీఫెన్సన్ కు సీఎం కేసీఆర్ గిఫ్ట్ గా ఇచ్చారు. 2014లో తొలి తెలంగాణ అసెంబ్లీలో కూడా ఆయనే నామినేటెడ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు.
ప్రజాతీర్పుతో ఎమ్మెల్యేలుగా గెలిచిన 119 మంది సభ్యుల్లో 23 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. చట్టసభలు వారికి కొత్త. ఇద్దరు ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా శాసనసభ్యులుగా విజయం సాధించారు. మహిళా ఎమ్మెల్యేలు ఆరుగురు, ముస్లిం మైనార్టీ సభ్యులు 8 మంది ఉన్నారు. గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్న 76 మంది ఈసారి మళ్లీ గెలుపొందారు.
ఇక అసెంబ్లీలో అందరికంటే సీనియర్ కేసీఆరే. 1985 నుంచి ఇప్పటివరకు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్, స్పీకర్ గా ఎన్నిక కానున్న పోచారం శ్రీనివాసరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యా నాయక్ ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వయసురీత్యా చూస్తే సభలో అందరికంటే పెద్దవారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అదలావుంటే అందరిలో అతి చిన్న వయసులో 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచినవారు ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్.