ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలు కైవసం చేసుకున్న టీఆర్ఎస్, మజ్లిస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు, ఆ పార్టీ మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి చెందిన ఒకరు విజయం సాధించారు. ఐదు ఖాళీలకు ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఐదుగురు అభ్యర్థులను నిలబెట్టాయి.
పోటీలో కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, డికే అరుణ!: లిస్ట్లో రేవంత్ రెడ్డి, ఖమ్మంపై రేణుకా పట్టు
కాంగ్రెస్ పార్టీ కూడా తమకు బలం ఉందని చెప్పి ఓ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో పోటీ అనివార్యం అయింది. కానీ వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, తెరాసను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించడంతో పాటు ఓటింగ్లో పాల్గొనవద్దని విప్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ఓటింగ్లో పాల్గొనకపోవడంతో తెరాసకు చెందిన నలుగురు, మజ్లిస్ పార్టీకి చెందిన ఒక్కరు విజయం సాధించారు. తెరాసకు చెందిన శేరి సుభాష్ రెడ్డి, యెగ్గెం మల్లేష్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మజ్లిస్ పార్టీకి చెందిన రియాజ్లు గెలిచారు.
అంతకుముందు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెరాస, మజ్లిస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో జరిగింది. ఇప్పటి వరకు 91 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.