శంషాబాద్ ఎయిర్పోర్టు షట్డౌన్.. లోకల్ వ్యాప్తితో హైదరాబాద్ కలవరం.. కొత్తగా మరో 5 కేసులు..
ఈనెల 31 వరకు తెలంగాణను లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అపెడమిక్ డిసీజ్ యాక్ట్- 1897(అత్యవసర పరిస్థితుల చట్టం) ప్రకారం ప్రభుత్వానికి సంక్రమించే అత్యయిక అధికారల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, దీనికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. ఆదివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనజీవనాన్ని స్తంభింపజేసే ఇంతటి కఠిన చట్టాన్ని ఎందుకు అమలు చేయాల్సి వస్తున్నదో వివరించారు.
కొత్తగా మరో 5 కేసులు..
‘‘ప్రపంచాన్ని భయకంపితం చేస్తోన్న కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా.. ప్రధాని మోదీ పిలుపుతోపాటు మనం కూడా 24 గంటల కర్ఫ్యూలో పాల్గొంటున్నాం. దీనికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు గొప్పగా స్పందించారు. ఇళ్లకే పరిమితమై.. వ్యాధి వ్యాప్తించకుండా తమ వంతు కాంట్రిబ్యూషన్ చెశారు. ప్రధానంగా సాయంత్రం ఐదు గంటలకు సంఘీభావ సంకేతంగా చప్పట్లు కొట్టే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఐక్యతను చాటిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కాగా, ఆదివారం కూడా తెలంగాణలో ఐదు కేసులు బయటపడ్డాయి. అవన్నీ పాజిటివ్ కేసులే..
అందరూ బయటి నుంచి వచ్చినోళ్లే..
ఆదివారం పాజిటివ్ కేసులుగా తేలిన ఐదుగురు వ్యక్తులూ విదేశాల నుంచి వచ్చినవాళ్లే. ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్, ఒకరు స్కాట్ లాండ్ నుంచి విమానాల్లో వచ్చారు. తద్వారా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 26కు చేరింది. అదృష్టవశాత్తూ అందులో ఏ ఒక్కరికీ ప్రాణాపాయ స్థితి లేదు. విదేశాల నుంచి వచ్చిన మిగతా వాళ్లను కూడా ఎక్కడికక్కడే క్వారంటైన్ లో ఉంచాం. సీరియస్ అనుకున్న కేసులను మాత్రమే గాంధీకి రిఫర్ చేస్తున్నాం. మొత్తంగా ఇప్పటిదాకా భయానక పరిస్థితులైతే లేవు. అయితే..
శంషాబాద్ షట్ డౌన్..
దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా సంభవిస్తున్న పరిణామాల దృష్ట్యా ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, డాక్ యార్డులు అన్నీ మూతపడటంతో.. విదేశాల నుంచి రాకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. అందులో భాగంగానే హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కూడా బంద్ పెడుతున్నాం. చికాగో నుంచి రావాల్సిన విమానం ఒక్కటే ఆదివారం రాత్రి ల్యాండవుతుంది. అది తప్ప మిగతా సర్వీసులేవీలేవు. అంటే, విదేశాల నుంచి ముప్పు తప్పినట్లే. ఇక దేశంలో తిష్టవేసిన వైరస్ పైనే ఫోకస్ పెట్టాలన్నమాట''అని సీఎం కేసీఆర్ వివరించారు. మరో కీలక అంశమైన..
లోకల్ వ్యాప్తిపై ఏమన్నారంటే..
ఇప్పటికే విదేశాల నుంచి వచ్చినవాళ్లలో చాలా మంది హోం క్వారంటైన్ లో ఉండగా, కొవిడ్-19 వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్లను ఆస్పత్రుల్లో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కాగా, హైదరాబాద్ లో వైరస్ లోకల్ గా వ్యాప్తి చెందిన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపైనా ఆయన స్పందించారు. కూకట్ పల్లికి చెందిన ఓ వ్యక్తికి వైరస్ లోకల్ గా సోకడం నిజమేనని సీఎం అంగీకరించారు. ఆ వ్యక్తి భార్య దుబాయ్ రిటర్న్ కావడం వల్లే ఇది సంక్రమించిందని, ప్రస్తుతం అతనిని అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదని సీఎం చెప్పారు.
31దాకా అన్నీ బంద్..
విదేశాల నుంచి వచ్చినవాళ్ల ద్వారా వైరస్ మన దగ్గర వేగంగా వ్యాప్తి చెందకపోవడం ఒకింత శుభపరిణామమన్న సీఎం కేసీఆర్.. మహమ్మారిని పూర్తిగా నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అందరి కోసం అందరం పరితపించి పనిచేసుకోవాలని, ఆదివారం చూపించిన పట్టుదలనే మరో తొమ్మిది రోజులు.. అంటే ఈనెల 31 వరకు ఇళ్లకే పరిమితం కావాలని, నిత్యావసరాల కోసం ఇంటికి ఒక్కర్ని మాత్రమే బయటికి అనుమతిస్తామని, ప్రైవేటు ఉద్యోగులకు కంపెనీలు జీతాలు చెల్లిస్తాయని, రోజు కూలీల కనీస అవసరాలను ప్రభుత్వమే తీర్చుతుందని, రేషన్ కార్డులున్న ప్రతి ఇంటికీ రూ.1500 నగదు, ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు.