వరంగల్ లో వలస విషాదం ... బావిలో శవాలుగా వలస కార్మిక కుటుంబం.. కేసులో కొత్త ట్విస్ట్
వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. సుప్రియ కోల్డ్ స్టోరేజ్ సమీపానగల ఒక బావిలో వలస కార్మికులు విగతజీవులుగా తేలారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు నిన్న రాత్రి లభ్యం కాగా, ఈరోజు తెల్లవారుజామున మరొక మృతదేహం లభ్యమైంది. నిన్న రాత్రి వెలికితీసిన ఒకే కుటుంబానికి చెందిన మృతుల్లో భార్య భర్తలు, వారి కుమార్తె, మనవడు ఉన్నట్లుగా గుర్తించారు. ఈరోజు తెల్లవారుజామున అదే కుటుంబానికి చెందిన మరొక మృతదేహం లభ్యమైంది. బావిలో ఇంకో మృతదేహం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు మరో మృతదేహం కోసం దర్యాప్తు చేపట్టారు.
వలస కార్మిక కష్టాలకు సింబాలిక్ గా .. మనసును పిండేస్తున్న రాంపుకార్ పండిట్ ఫోటో వెనుక అసలు కథ ఇదే
మిస్టరీగా మారిన వలస కార్మిక కుటుంబం మృతి
గత కొంతకాలంగా వలస కార్మికులకు జీవనోపాధికి ఇబ్బందిగా మారడం, స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితులు రావడం వంటి కారణాలతో వారేమైనా ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిలో ఇప్పటికి ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ తెలియలేదు. ఇక వీరితో పాటు అక్కడే నివాసం ఉన్న మరో ఇద్దరు బీహార్ యువకులు కనిపించకపోవటంతో ఇది హత్యనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
నిన్న బావిలో శవాలై తేలిన మక్సూద్ కుటుంబంలో నలుగురు సభ్యులు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మక్సూద్ , అతని భార్య నిషా, కుమార్తె బూస్రా, మూడు సంవత్సరాల వయసున్న బూస్రా కొడుకు , మక్సూద్ ఇద్దరు కొడుకులు మొత్తం ఒకే కుటుంబానికి సంబంధించిన ఆరుగురు వలస కూలీలుగా గీసుగొండ మండల పరిధిలోని గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియాలో పని చేస్తున్నారు. వీరితో పాటు అదే భవనంలో బీహార్ కు చెందిన ఇద్దరు యువకులు కూడా ఉన్నట్లు సమాచారం. బీహార్ కు చెందిన శ్యామ్, శ్రీ రామ్ లు కూడా సాయి దత్త ట్రేడర్స్ భవనం ఆవరణలో నివాసముంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు గానీ నిన్న మక్సూద్ కుటుంబానికి సంబంధించిన నాలుగు మృతదేహాలు బావిలో తేలాయి.
నేడు తెల్లవారుజామున బావిలో తేలిన మరో మృతదేహం .. స్థానికంగా కలకలం
సంఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులు మృతదేహాలను బయటకు తీసి, ఎవరి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సూసైడ్ గా అనుమానించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున మరో మృతదేహం బావిలో తేలడం స్థానికంగా కలకలం రేపింది వలస కూలి మక్సూద్ కుటుంబానికి సంబంధించిన మిస్సయిన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు మృతదేహం గా భావిస్తున్నారు. బావిలో ఇంకో మృతదేహం కూడా ఉండొచ్చు అన్న అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
వలస కార్మికుల మృతి కేసులో కొత్త ట్విస్ట్.. బీహారీలపై అనుమానం
అయితే ఇదే సమయంలో వలస కార్మికుల మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం మక్సూద్ మనవడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా, ఆ సందర్భంలో భర్తను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న బుస్రా విషయంలో మక్సూద్ కుటుంబానికి, బీహార్ యువకులకు మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో ఈ కుటుంబము ఏమైనా విషప్రయోగం జరిగిందని అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్ యువకుల కోసం గాలింపు .. మరో మృతదేహం కోసం బావిలో కొనసాగుతున్న గాలింపు
శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం, బీహార్ కు సంబంధించిన ఇద్దరు యువకులు కనిపించకపోవడం, ఒకే కుటుంబానికి చెందిన వారంతా బావిలో విగతజీవిగా కనిపించడం ఈ అనుమానాలకు కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతదేహాలు లభ్యం కాగా, ఇంకొక మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఇక కనిపించకుండాపోయిన బీహార్ యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఇది హత్యనా, లేక ఆత్మహత్యనా , ఇందులో బీహార్ యువకుల పాత్ర ఏమైనా ఉందా? అన్న అన్ని అంశాలను తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
Recommended Video
సంఘటనా స్థలాన్ని సందర్శించనున్న మంత్రి ఎర్రబెల్లి
సంఘటన స్థలాన్ని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించనున్నారు. వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకే కుటుంబానికి చెందిన వలస కార్మికులు మృతి చెందిన ఘటన నేపధ్యంలో తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి సంఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ఇక ఈ ఘటనలో మొదట ఆత్మహత్య అని అనుమానించినా , బీహార్ యువకులు కనిపించకపోవటంతో హత్య చేసి బావిలో పడేశారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .