విద్యుత్ తీగలపై పడిన ఫ్లెక్సీ: ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైలు
హైదరాబాద్: గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం నగరంలో బీభత్సం సృష్టించింది. దీంతో విద్యుత్ తోపాటు ట్రాఫిక్కు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ దాటాక రాజ్నగర్ వద్ద భారీ హోర్డింగ్ ఫ్లెక్సీ చిరిగిపోయి పక్కనే గల రైల్వే విద్యుత్ తీగలపై పడింది. ఆ సమయంలోనే లింగంపల్లి నుంచి నాంపల్లికి వెళుతున్న ఎంఎంటీఎస్ డ్రైవర్ ఫ్లెక్సీని చూసి రైలును నిలిపేశారు.
మార్గమధ్యలో రైలు ఆగిపోవడంతో ప్రయాణికులతోపాటు స్థానికులు ఏం జరిగిందోనని అక్కడికి చేరుకున్నారు. తీగలపై పడ్డ ఫ్లెక్సీ వర్షానికి తడి ఉండటంతో షాక్ వస్తుందనే భయంతో ఎవ్వరూ తొలగించే సాహసం చేయలేదు.
దీంతో సుమారు 20నిమిషాల పాటు ఎంఎంటీఎస్ అక్కడే ఆగిపోయింది. అయితే, కొంతసేపటికి బాగా ఈదురు గాలులు రావడంతో ఫ్లెక్సీ తీగల పైనుంచి కందపడింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఎంఎంటీఎస్ డ్రైవర్ రైలును ముందుకు కదిలించారు. గురువారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు చేపట్టారు.