వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష: మృతుల ఫ్యామిలీకి రూ. 5లక్షలు
హైదరాబాద్: హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసన భారీ వర్షాలు, వరద ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అత్యవసర ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ కోసం రూ. 5 కోట్లు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరపున ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు, 3 దుప్పట్లు వెంటనే అందించాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ. 5 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారని, మృతుల్లో హైదరాబాద్ పరిధిలోనే 11 మంది ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్తిక సాయం అందించాలని, ఇల్లు పూర్తిగా కూలిపోయినవారికి కొత్తగా మంజూరు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందించాలన్నారు.
భారీగా పంట నష్టం.. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు, వీటి నష్టం విులవ సుమారు రూ. 2వేల కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా మత్తం 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో సుమారు 20వేలకుపైగా ఇళ్లు వరద నీటిలో ఉన్నాయని, ఇందులో 35వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్షాలకు మరో రెండ్రోజులపాటు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.