తెలుగు రాష్ట్రాల్లో వికసిస్తున్న కమలం..! బీజేపిలో కొసాగుతున్న జోష్..!!
అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాటుతోంది. ఏపీతో పాటు తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, సీనియర్ నేత పురందేశ్వరి కూడా తగ్గేది లేదన్నట్టుగా కనిపిస్తున్నారు. అసలు ఏం చూసుకుని కమలం తాము బలపడేందుకు ప్లాన్ చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందకుండా ఉంది. వాస్తవానికి 2019లో వైసీపీ భారీ మెజార్టీ. తరువాత ఘోరంగా ఓడిన జనసేన, టీడీపీ రెండూ సైలెంట్ అయ్యాయి. బీజేపీ కూడా అదేదారిలో నడుస్తుందని అందరూ భావించారు.
కానీ.. తెలంగాణలో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లతో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఇదే మంచి సమయమని కమలనాథులు భావించినట్టున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలో పావులు కదుపుతుంది. కాంగ్రెస్లోని లొసుగులు, బలహీనతను అవకాశం చేసుకుని వలసలను ప్రోత్సహిస్తుంది.ఏపీలోనూ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులకు కాషాయ కండువా కప్పేసింది. ఇది కేవలం టీడీపీ పట్ల వ్యతిరేకతను, పార్టీ మూలస్తంభాలను దెబ్బతీసేందుకే అనేది బహిరంగ రహస్యం. అయితే మున్ముందు కన్నా సారథ్యంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఏపీ బీజేపీ నేతలందరూ హాయ్లాండ్లో రహస్యంగా బేటీ కావటం కూడా కమలం ఎత్తులకు అద్దం కడుతోంది. అయితే కన్నా ఇదంతా అదిష్టానం ఆదేశాలతో చేస్తున్నట్టుగానే విపక్షాలు చర్చించుకుంటున్నాయి. రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల నుంచి సీనియర్ నేతలనే కాదు.. గ్రామస్థాయిలో బలమైన కేడర్ ఉన్న నేతలను తమ వైపునకు మళ్లించుకోవాలనేది వారి ఎత్తుగడగా తెలుస్తోంది.
టీడీపీ నుంచి కనీసం 10 మందికి పైగా ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానం పలికేందుకు సిద్ధపడ్డారు. వీరిలో కమ్మవర్గానికి చెందిన వారేగాకుండా.. మిగిలిన సామాజికవర్గాలు కూడా ఉండేందుకు వీలుగా ఇప్పటికే కేంద్ర మంత్రి ఒకరు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. టీడీపీ ఊహించని షాక్ తిన్నట్టే.