సర్వేలన్నీ మనకే, గెలిపించే బాధ్యత నాది: సిట్టింగ్లకు కెసిఆర్ బంపరాఫర్
వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.105 సీట్లను సునాయాసంగా గెలుస్తామన్నారు. మిగిలిన వాటిల్లోనూ కష్టపడితే విజయం సాధ్యమన్నారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 105 సీట్లను సునాయాసంగా గెలుస్తామన్నారు. మిగిలిన వాటిల్లోనూ కష్టపడితే విజయం సాధ్యమన్నారు.
గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలన్నారు. తెలంగాణలో సమగ్ర భూ సర్వే కింద చేపడుతున్న రెవెన్యూ రికార్డుల సమూల ప్రక్షాళన చరిత్రాత్మకమని, విప్లవాత్మకమని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ 'పాలిటిక్స్'పై మహేష్ కత్తి తీవ్రంగా, మేం రంగంలోకి దిగితే.. మెగా ఫ్యాన్స్ వార్నింగ్
దేశంలో మొట్టమొదటిసారి చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని రైతులు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కెసిఆర్ మీటింగ్
సమగ్ర భూసర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాల నిర్మాణం, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు.
సర్వేలు మనకే అనుకూలం
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. అన్ని సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయని, ప్రతిపక్షాలపై ప్రజలకు విశ్వాసం లేదని, ప్రజలు మనవెంటే ఉన్నారని చెప్పారు. మొత్తం 119 స్థానాల్లో ప్రస్తుతం మనకు 90 ఉన్నాయని, ఏడు మజ్లిస్కు ఉన్నాయని, మిగిలిన 22లో ఎస్సీ, ఎస్టీ స్థానాలు పోను మిగతావాటిలోనూ మనదే విజయమన్నారు.
ఎన్నికలపై మీకు చింత లేదు, నేను చూసుకుంటా
రిజర్వ్ స్థానాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని కెసిఆర్ అన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని, మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని చెప్పారు. ఎన్నికలపై మీకు ఎలాంటి చింత అవసరం లేదని, అన్నీ నేను చూసుకుంటానని చెప్పారు. అయితే, మీరు ప్రజలకు అన్ని విధాలా చేరువ కావాలన్నారు.
నేను చెప్పింది చేయండి
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తానని, నేను చెప్పిన పనులు చేస్తే చాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను నేనే తీసుకుంటానని కెసిఆర్ చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే వారే దీవిస్తారన్నారు.