కోదండరామ్ సూచనలు పాటిస్తాం: హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల నివారణకు అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నామని, ఈ విషయంలో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సలహాలనూ సూచనలనూ అమలు చేయడానికి కృషి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోదండరాం లేవనెత్తిన అంశాలతో తాము విభేదించడం లేదని, ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయనను చర్చలకు ఆహ్వానిస్తున్నామని చెప్పింది.
రైతు ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యాల్లో ప్రొఫెసర్ కోదండరాం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యానికి సంబంధించి ప్రభుత్వం అదనపు కౌంటర్ దాఖలు చేసింది. రైతు ఆత్మహత్యలను సామాన్యంగా పరిగణించడంలేదని, దీనిని మానవ హ క్కుల అంశంగా పరిగణిస్తునామని తెలిపింది. కనీస మద్ధతు ధరపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదని, తాము చేసిన సిఫారసులపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది.
ఆత్మహత్యల నివారణకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదని, దీనికి గత పాలకుల వ్యవహారశైలే కారణమని ఆరోపించింది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సమస్యలపై దృష్టి పెట్టామని, నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం కృషిచేసిందని, ఇప్పుడు రోజుకు 7 గంటలు విద్యుత్ నిరంతరాయంగా అందిస్తున్నామని వివరించింది.
గత సంవత్సరం జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు హైదరాబాద్ మినహాయించి 9 జి ల్లాల్లో 782 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు లెక్కలు చెప్పారని, వీటిపై అధ్యయనం చేయడానికి త్రిసభ్య కమిటీని వేశామని తెలిపింది. కమిటీ 673 కేసులను పరిశీలించి వాటిలో 342 కేసులు అసలైనవిగా నిర్ధారించిందని, 313 కేసుల్లో బాధితులకు ఎక్స్గ్రేషియా, రిలీఫ్ ఫండ్ చెల్లించామని వెల్లడించింది.
పంటల భీమా విషయంలో రైతును యూనిట్గా స్వీకరించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని తెలిపింది. రైతు ఆత్మహత్యలపై తమ వాదనలు వినాలంటూ ప్రొఫెసర్ కోదండరాం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కౌంటర్ దాఖలు చేశారు.