నేను చెప్పినట్లు చేయండి, గెలుపు బీజేపీదే: కేసీఆర్తో ఒప్పందంపై తేల్చేసిన అమిత్ షా
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్దామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ నేతలకు హితబోధ చేశారు. తెలంగాణలో అధికారమో లేక ప్రతిపక్షంలోనే ఉండాలని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత మనకు మూడోస్థానం అనే మాట ఉండకూడదని తేల్చి చెప్పారు. మీరేం చేస్తారో మాకు తెలియదని, మా నుంచి కావాల్సిన అన్ని రకాల సహకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ నెల 28వ తేదీ లోపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సభలు, నవయువ సమ్మేళనాలు పూర్తి చేయాలని సూచించారు. రైతు ఆత్మహత్యల కుటుంబాలను కలవాలని సూచించారు. గ్రామాల్లో వార్డు మెంబర్స్, సర్పంచ్లను కలవాలన్నారు. మళ్లీ 28వ తేదీన వస్తానని, అప్పటిలోపు ఇవన్ని పూర్తి చేయాలన్నారు.
ఇక్కడ గెలిస్తేనే: కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లారో చెప్పిన అమిత్ షా!
లోపాయికారి అనుమానాలే వద్దు
తెలంగాణలో మన టార్గెట్ మజ్లిస్ పార్టీ, కేసీఆర్ అని పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశనం చేశారు. కేసీఆర్తో లోపాయికారి ఒప్పందం ఉందని ఎవరైనా భావిస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. అలాంటి అనుమానాలు ఎవరికైనా ఉంటే మనస్సులో నుంచి వెంటనే తీసివేయాలని సూచించారు.
మరో ఇరవై ఏళ్లయినా తెలంగాణలో అధికారంలోకి రాలేం
అలాగే ఇక్కడ ఉన్న అందరు నేతలకు కూడా మరోసారి నేను ఆ విషయం చెబుతున్నానని, లోపాయికారి రాజకీయాలు చేయవద్దని అమిత్ షా సూచనలు చేశారు. ఇక్కడి పరిస్థితిని నేను పూర్తిగా గమనిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం పొందకపోతే మరో ఇరవై ఏళ్లయినా తెలంగాణలో అధికారంలోకి రాలేమని చెప్పారు.
ఒంటరిగా పోటీ చేస్తున్నాం
కేసీఆర్ మన ప్రత్యర్థి అని, మజ్లిస్ మన లక్ష్యమని అమిత్ షా నేతలకు చెప్పారు. మనం ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ, చేవెళ్ల, మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జులు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇంచార్జులతో సమావేశం సందర్భంగా అమిత్ షా ఈ సూచనలు చేశారు.
నేను చెప్పినట్లు చేయండి, తెలంగాణలో గెలుపు మనదే
నేను చెప్పినట్లు చేయండని, గెలుపు మనదేనని, కనీసం ప్రతిపక్షంలో అయినా కూర్చుంటామని పార్టీ నేతలకు అమిత్ షా హితబోధ చేశారు. పలు రాష్ట్రాల్లో బూత్ కేంద్రాలు, శక్తి కేంద్రాలుగా పక్కాగా పని చేయడం వల్లే అధికారంలోకి వచ్చామని చెప్పారు. శక్తి కేంద్రాల అధ్యక్షులు తమకు కేటాయించిన బూత్లకు 15 రోజులపాటు వెళ్లి పార్టీ సూచించిన 23 మార్గదర్శకాలను పాటిస్తే తెలంగాణలో భారీ సీట్లు వస్తాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందన్నారు.
తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం దేశం ఎదురు చూస్తోంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, 15 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారని, పంజాబ్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో పాగా వేస్తే పార్టీ సంపూర్ణ విజయం సాధించినట్లు అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ విజయం కోసం దేశప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పేదలు అనారోగ్యనికి గురై అనుకోని పరిణామాలు ఎదురైతే కేసీఆర్దే బాధ్యత అన్నారు. ఆయుష్మాన్ భారత్కు తెరాస తిరస్కరించిందని చెప్పారు. మజ్లిస్ పార్టీకి అండగా ఉంటే ఏ పార్టీ కూడా దేశంలో ఎక్కడా అధికారంలో ఉండేందుకు వీల్లేదన్నారు. అందుకు ప్రజామద్దతుతో మనం ముందుకెళ్లాలన్నారు.
అమిత్ షాతో స్వామీజీల భేటీ
స్వలింగ సంపర్కం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, వివాహేతర సంబంధాలు వంటి అంశాలపై కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు హిందూ మత విశ్వాసాలు, ధర్మాలపై ప్రభావం చూపేలా ఉన్నాయంటూ పలువురు సాధువులు... అమిత్ షా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయంలో అయినా భారత పౌరులందరికీ ఒకే చట్టం అమలవ్వాలన్నారు. బుధవారం హైదరాబాద్ కాచిగూడలోని శ్యాంబాబా మందిర్ను సందర్శించిన అమిత్ షా అక్కడి సాధుసంతులతో సమావేశమయ్యారు. మతమార్పిడులను నిరోధించాలని, ఆలయాలు, ఆశ్రమాల ఆస్తుల ఆక్రమణలను అడ్డుకోడానికి తగిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఈ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అమిత్ షా సాధువులకు హామీ ఇచ్చారు.