నాలుగు సీట్లు వస్తే భూమ్మీద ఆగటం లేదు .. బీజేపీ నాయకులు ఎగిరి పడుతున్నారన్న కేటీఆర్
Recommended Video
రానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపబోతుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కసరత్తు ప్రారంభించిందా అంటే అవును అనే చెప్తున్నారు తెలంగాణా బీజేపీ నాయకులు . కానీ టీఆర్ఎస్ మాత్రం అంత సీన్ లేదు . నాలుగు సీట్లు వస్తే అయిపోయిందా .. ఈ మాత్రం దానికే ఎగిరెగిరి పడుతున్నారు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన నాటి నుండి ఊపు మీద ఉన్న బీజేపీని పట్టించుకునేంత సీన్ లేదు అంటూనే ఓ కంట కనిపెట్టాలని చెప్తున్నారు టీఆర్ఎస్ నాయకులు . ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బీజేపీ గురించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ అసలు రంగు బయటపడుతుంది అన్న కేటీఆర్
మొన్నటికి మొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్కు బీజేపీ నేతలు ఓ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుంది అని చెప్పిన నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ కు సోకుగా ఉంటే ఇప్పుడే ఆ పదవి తీసుకోవాలని సూచించారు. ఇక తాజాగా కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే భూమ్మీద ఆగడం లేదని, ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు . రాష్ట్రంలో వాళ్లకు అసలు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని, త్వరలో రాబోతున్న మునిసిపల్ ఎన్నికల్లో వాళ్ల అసలు రంగు బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.ఎంతసేపూ టీఆర్ఎస్ నుంచి ఎవరిని లాగుదామా అన్న ధోరణి తప్ప బీజేపీ ఇంకేం చెయ్యగలదు అని విమర్శించారు.
కవితే కాదు రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారన్న కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో తాము మెజారిటీ సీట్లు గెలుచుకున్నామని పేర్కొన్న కేటీఆర్ నాలుగు సీట్లు గెలుచుకుననంత మాత్రాన బీజేపీ నాయకులు ఢాం.. ఢూం అంటూ ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక కవిత ఓటమి గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారని బదులిచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అని ఆయన వ్యాఖానించారు . సచివాలయానికి కొత్త భవన నిర్మాణంపై మాట్లాడుతూ.. నాలుగైదు రాష్ట్రాలు కొత్త భవనాలను నిర్మించుకున్నాయని, ప్రతీ దానినీ వ్యతిరేక దృష్టితో చూడడం సరికాదని హితవు పలికారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తాను మరోమారు చాటుతామని చెప్పిన కేటీఆర్ రెండోస్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీపడాల్సి ఉంటుందని అన్నారు.
యేరు ఏది మాట్లాడితే దానికి బదులివ్వాల్సిన ఖర్మ నాకు లేదన్న కేటీఆర్
ఇక బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఎవరెవరో ఏమేమో మాట్లాడతారని, వాటన్నింటికీ బదులివ్వాల్సిన ఖర్మ తనకు పట్టలేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
ఇటీవల బీజేపీలోకి వెళ్లిన టీఆర్ఎస్ నేతల విమర్శల గురించి మాట్లాడుతూ.. పార్టీని వీడి వెళ్లేవారు ఎప్పుడూ మంచి చెప్పరని, వెళ్తూవెళ్తూ నాలుగు రాళ్లు వేసేసి వెళ్లిపోతారని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తానికి బీజేపీ ఎగిరెగిరి పడుతుందని మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయని ఎవరేమిటో త్వరలోనే తేలుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.