ఆరేళ్లుగా అవినీతికి ద్వారాలు తెరిచారు తప్ప సాదించిందేమీ లేదు..! కేసీఆర్ పై మండిపడ్డ జీవన్ రెడ్డి..
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కుతున్నాయి. బీజేపి నేషనల్ వర్కింగ్ ప్రసిడెంట్ జేపి నడ్డా, తెలంగాణ సీఎం తనయుడు కేటీఆర్, విజయశాంతి, బీజేపి తెలంగాణ అద్యక్షుడు లక్ష్మణ్, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావుపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని కలెక్టర్ల సదస్సులో స్వయంగా తానే ఒప్పుకున్నారని జీవన్రెడ్డి ఆరోపించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రశేఖర్ రావు తన పాలన అవినీతిమయమైందని గుర్తించారన్నారు. సీఎం వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నందుకు జీవన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అవినీతికి ద్వారాలు తెరవడం మినహా చంద్రశేఖర్ రావు సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు.అంతే కాకుండా అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారంటే, ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే కదా..? అని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులను కట్టడి చేయాల్సింది కలెక్టర్లు కాదా అని, కలెక్టర్లలను అదుపు చేయాల్సింది ముఖ్యమంత్రి కాదా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారని, ఆ పథకం కోసం అనేక శాఖల నిధులను దారి మళ్లించారని జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను బలిచేస్తున్నారని విమర్శించారు. చంద్రశేఖర్ రావుకు చిత్త శుద్ది ఉంటే తక్షణమే రాజకీయ అవినీతిని తగ్గించి, ఆ తర్వాత అధికారుల గురించి మాట్లాడాలన్నారు. టీఆర్ఎస్పై బీజేపీ నేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఇప్పటికైనా టీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడటం సంతోషమన్నారు. బీజేపీ నేతలు మాటలతో యుద్ధం కాకుండా, చేతల్లో చూపించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.