కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం అందుకేనా...??
Recommended Video
ఒంటి చేత్తో తెలంగాణ సాధించిన సాహసికుడిగా, ఎన్నికల వ్యూహాలు రచించడంలో అభినవ చాణక్యుడిగా, రాజకీయ శత్రువుల పట్ల చండశాసనుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గులాబీ శ్రేణులు అభివర్ణిస్తుంటారు. టీఆర్ఎస్ కార్యకర్తల అంచనాలకు ధీటుగా కేసీఆర్ రాజకీయ చతురత కూడా ఉంటుంది. ప్రతిపక్షాలను కడిగేయాలన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని దూషించాలన్నా., ప్రజల నాడి పట్టుకోవాలన్నా కేసీఆర్ తరవాతే ఎవరైనే అనే భావాలకు అనుకూలంగా వ్యవహరిస్తుంటారు కేసీఆర్. ఇంత పకడ్బందీగా రాజకీయం చేసే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్దామని పదేపదే చెప్పడంలో ఏదో మతలబు దాగుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అన్నీ సరిగ్గా ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్టు, అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తున్నందుకే కేసీఆర్ ముందస్తు రాగం అందుకుంటున్నారని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
పార్టీ క్యాడర్ ఆలోచనలో కేసీఆర్ రాజకీయ దురంధరుడు..
టీఆర్ఎస్ శ్రేణుల దృష్టిలో కేసీఆర్ భయంకర యోధుడు. ఆరు నూరైనా మళ్లీ పార్టీని అధికారంలోకి తేగల సమర్ధుడు. భూమి బద్ధలైనా... ఆకాశం ఊడిపడినా ఆయనున్నాడన్న ధీమా! ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంటే ఉండనీగాక, కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖాయం అంటున్నారు పలువురు టీఆర్ఎస్ నేతలు. వాళ్ల ధీమాకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన రాజకీయ చతురత. తిమ్మినిబమ్మిని చేసైనా తమ నాయకుడు మళ్లీ పార్టీని పవర్ లోకి తెస్తారని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. శ్రేణులు, నేతల ధీమా ఇలా ఉంటే... కేసీఆర్ మాత్రం ఎన్నికలంటే భయపడుతున్నట్టు కనిపిస్తోంది.
పైకి అంతా అనుకూలంగా కనిపిస్తున్నా ఎక్కడో ఆందోళన..
టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అన్నదానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ లో తీవ్ర ఆందోళన ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ముందస్తు ఎన్నికల మంత్రం జపిస్తున్నారు. ఎలాగైనా డిసెంబర్ లోపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు పూర్తి చేసుకుని తిరిగి అధికారం పీఠం పై కూర్చోవాలని ఆత్రుత పడుతున్నారు. కారణం లేకుండానే ముందస్తుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తందో రాదో అన్న సందేహమే కేసీఆర్ ను ముందుస్తు ఎన్నికలకు వెళ్లేలా చేస్తుందన్నది కొందరు రాజకీయ విశ్లేషకులు భావన. గులాబీ బాస్ కు గెలుపు పై నిజంగా అంత ధీమా ఉంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేవారన్నది వారి ఉద్దేశం. ఏదో తేడా కొడుతుంది కాబట్టే ప్రతిపక్షాలు కాళ్లు బార్ల చాపి కూర్చున్న ఈ సమయంలోనే ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారంటున్నారు.
శత్రువు ఏమరుపాటుగా ఉన్నప్పుడు దెబ్బకొట్టాలన్నదే కేసీఆర్ వ్యూహం..!!
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో ఎన్నికలు జరిగితే అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని కురుక్షేత్రానికి రెడీ కావచ్చు! మరింత ఉదృతంగా ప్రజల్లోకి వెళ్లే వెసులుబాటు, సమయం ఆ పార్టీకి లభిస్తుంది. కాంగ్రెస్ కు ఆ అవకాశం ఇస్తే టీఆర్ఎస్ గ్రాఫ్ దెబ్బతినొచ్చు. ఇప్పుడైతే ఆ పార్టీ ఇంకా అంతర్గత రుగ్మతలతో కొట్టుమిట్టాడుతోంది. పార్టీలో గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. కాలం కలిసొచ్చినప్పుడే పని చక్కబెట్టుకోవాలన్న రీతిలో కాంగ్రెస్ ఇలా ధీనావస్తలో ఉన్నప్పుడే ఎన్నికలు ముగించేసుకుంటే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ తప్ప మరే పార్టీ బలంగా కనిపించడం లేదు.
అంతా ఓకే.. మరి తేడా ఎక్కడకొడుతున్నట్టు...?
అభివృద్ది, సంక్షేమం విషయంలో దేశంలో తమను మించిన వారు లేరని కేసీఆర్ అండ్ కో ఊదరగొడుతున్నారు. ఏ పత్రిక తిరగేసినా గులాబీ భజన కనిపిస్తోంది. ఏ టీవీ ఛానెల్ పెట్టినా టీఆర్ఎస్ స్లోగన్సే వినిపిస్తున్నాయి. అంతా ఫీల్ గుడ్ అన్నట్టుగా వాతావరణం ఉంది. మరో వైపు రైతు బంధు పేరుతో 12 వేల కోట్లు నేరుగా రెండు విడతలుగా నగదు పంపకం జరుగుతోంది. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నా... కేసీఆర్ లో గెలుపు పై ధీమా కనిపించడం లేదా? అన్నది ప్రశ్న. టీఆర్ఎస్ పాలన అద్బుతంగా ఉంటే... ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా మళ్లీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం. అదే నిజమనుకుంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి పెద్ద ఇబ్బందేమీ ఉండ కూడదు. కానీ, కారణం లేకుండానే... ప్రతిపక్షాలను బూచిగా చూపి కేసీఆర్ ముందుస్తుకు ఎందుకు కాలు దువ్వుతున్నారన్నదే ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలక ప్రశ్న. ఆ ప్రశ్నను కాస్త లోతుగా విశ్లేషిస్తే... మళ్లీ అధికారంలోకి రావడం పై కేసీఆర్ కు పూర్తి స్థాయిలో ధీమా లేదన్నది అర్థమవుతోంది. అందుకే... అందరూ నిద్రాణంగా ఉన్న వేళ... టైం చూసుకుని పని చక్కబెట్టుకోవాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది.