దీర్గ కాలిక ప్రయోజనాల కోసం సరిపెట్టుకున్నాం.! రాజకీయాల్లో తమది విశాల ద్రుక్పదం అంటున్న టీడిపి
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్లకు తెలంగాణ ముందస్తు ఎన్నికలు తెగ ఇబ్బందులకు గురిచేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి సుధీర్గ కాలం పనిచేసినా ఎన్నికల సమయం వచ్చేసరికి పొత్తు పేరుతో తమ రాజకీయ భవిష్యత్తు గల్లంతైదని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే దీర్గకాలిక ప్రయోజనాల కోసం కొన్ని త్యాగాలకు సిద్దం కావాల్సి వచ్చిందని టీడిపి ముఖ్యనేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు తమ రాజకీయ భవితవ్యాన్ని అగాదంలోకి నెట్టిందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల ఆవేదన..! కొంపముంచిన పొత్తు అంటున్న తమ్ముళ్లు..!!
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలనుకున్న టీడిపి, సీట్ల విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. మొదట్లో 24 సీట్లలో పోటీ చేయాలనుకున్నా అది సాద్యపడక మహాకూటమి సీట్ల సర్దుభాటులో భాగంగా 14 సీట్లు మాత్రమే పోటీ చేస్తున్నామని చెప్పెకొచ్చారు తెలుగుదేశం నేతలు. చివరకు 13 మంది అభ్యర్థులకు మాత్రమే బీ ఫారాలు ఇచ్చి కూటమి విశాల ప్రయోజనాల కోసం సరిపెట్టుకున్న టీడిపి నాయకులు అంటున్నారు.
బీ ఫామ్ ల కేటాయింపులో హైడ్రామా..! ఉత్కంఠగా మారిన ఇబ్రహింపట్నం టికెట్..!
ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా, టీడిపి హాడావుడి చాలా ఉండేది. ఎన్నికల్లో ఏదయినా కూటమి ఏర్పడితే దానిని లీడ్ చేసేది. అంతేకాదు ఇతర పార్టీలకు సీట్లు కేటాయించటంలో కీలకంగా వ్యవమారించేది. కాని ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయింది. మహాకూటమిలో కాంగ్రెస్, టీడిపి, సిపిఐ, టీజేఎస్ లు జట్టుకట్టాయి. అయితే టీడిపి మాత్రం పోటీ చేయాలనుకున్న సీట్లను సాధించుకోలేక పోయింది. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుకున్న స్థాయిలో కూటమితో సీట్ల కోసం పోరాడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడిపి నేతలపై మండిపడుతున్న ఆశావహులు..! తప్పదంటున్న ముఖ్య నాయకులు..!
గత ఎన్నికల్లో గెలిచిని టీడిపి ఎమ్మెల్యేలు పార్టీ మారినా, పార్టీతో ఉన్న నాయకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ఈ సారి ఎన్నికల వేళ చాలా మంది పోటీ చేయాలని ఆశ పడ్డారు. కాని కూటమిలో టీడిపి కి కేటాయించిన 14 సీట్లకే బి ఫారాలను ఇవ్వలేక పోయింది పార్టీ. పైగా మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీకి ఆశావాహులు పెరిగిపోయారనే కారణం అధిష్టానం చెప్పటాన్ని తప్పుపడ్తున్నారు టీడిపి ఆశావాహులు. పార్టీలో ఆశావాహులు ఉంటే, కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువ ఉందని సీట్లు ఎలా వదులుకుంటారని పార్టీ పెద్దలపై మండిపడ్తున్నారు..
వచ్చింది 14..! పోటీ చేసింది మాత్రం పదమూడే..!!
టీడిపి నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను 4 విడతలుగా విడుదల చేసినా మొత్తం 13 మందికే పరిమితం చేశారు. అందులోనూ 12 మందికి ముందుగా బి ఫారాలను ఇచ్చిన టీడిపి, ఇబ్రహింపట్నం అభ్యర్థి సామరంగారెడ్డికి టికెట్ ఇస్తున్నామని ప్రకటించినా, అందరితో కలిపి బీ ఫారం ఇవ్వలేదు. చివరికి నామినేషన్ చివరి రోజున ఉధయం 7 గంటలకు బి ఫారం ఇచ్చారు. మరోపక్క 14 సీటు పోటీ చేస్తున్నాం అని చెప్పుకొచ్చినా, ప్రకటన మాత్రం చేయలేక పోయారు.. చివరి సీటు పటాన్ చెరు అయి ఉంటుందని అక్కడి ఆశావాహులు నందీశ్వర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ లు ఎదురు చూశారు. పార్టీ నుంచి నామినేషన్ సమయం ముగిసేంత వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వక పోవటంతో .. ఆవేధన గా వెనుదిరిగారు. దీంతో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు తీరని అన్యయం జరిగినట్టు చర్చ జరుగుతోంది.