అసలైన బాహుబలి ఇతనే అంటూ కేటీఆర్ ట్వీట్: ఏనుగును ఎత్తుకొని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అసలైన బాహుబలి అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఫోటోను కూడా పెట్టారు.
ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఓ ఏనుగు పిల్లను జాగ్రత్తగా తీసుకు వెళ్తున్నాడు. ఈ ఒక్క ఫొటోతో అతను హీరో అయ్యాడు. ఇతని పేరు శరత్ కుమార్. తమిళనాడులో ఫారెస్ట్ గార్డుగా పని చేస్తున్నాడు.
ఇటీవల అతను గార్డుగా పని చేస్తున్న అడవిలో ఓ ఏనుగు పిల్ల గుంతలో పడిపోయింది. దాంతో ఆ పిల్ల తల్లి అడవి సమీపంలో ఉన్న రోడ్డు పైకి వచ్చి వాహనాలను ఆపేసింది. కొందరు వ్యక్తులు దాన్ని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు.
Real Bahubali 🙏👏🏻 https://t.co/oOyGbXjxu2
— KTR (@KTRTRS) December 31, 2017
ఆ సమయంలో అది గుంతలో పడింది. వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ గార్డుకు సమాచారం ఇచ్చారు. శరత్ కుమార్ ఏనుగు పిల్లను కాపాడేందుకు వెళ్లాడు.
తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లను భుజాలపై మోసుకుని దగ్గరలోని ఆసుపత్రికి తరలించాడు. అతను పిల్లని ఎత్తుకుని తీసుకెళుతున్న ఫొటో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్గా మారింది. అందరూ తన కంటే బరువుగా ఉన్న ఏనుగు పిల్లను ఎలా మోసుకెళ్లావని ప్రశ్నిస్తున్నారని అతను తెలిపాడు.