ఆగస్టు15 నుండి పాలన ఏంటో చూస్తారనడం తప్పు !ఆరేళ్లుగా కేసీఆర్ గాడిద పళ్లు తోమారా అన్న ఇంద్రసేనారెడ్డి
Recommended Video
హైదరాబాద్ : దేశం మొత్తం బీజేపి వైపు చూస్తోందని, స్వతంత్య్ర భారత చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొస్తున్నన్ని సంస్కరణలు ఏ ప్రధాని తీసుకురాలేదని ఉమ్మడి రాష్ట్ర బీజేపి మాజీ అద్యక్షుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ తో పాటు తాజాగా ఆర్గికల్ 370 రద్దు వంటి నిర్ణయాలతో దేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని, ఇది కేవలం బీజేపి ప్రభుత్వం సాధించి ఘనత అని ఆయన అన్నారు. మోదీ ప్రజారంజక పాలన చూసి దేశంలోని అన్ని పార్టీల నేతలు బీజేపి వైపు చూస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు పట్ల కొన్ని పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమని, ఎంఐఎం లాంటి పార్టీలు ముస్లిం సమాజానికి ఛాంపియన్ లుగా చెప్పుకుని బీజేపి ప్రతిష్టను దిగజార్చే పనులు చేస్తోందని మండిపడ్డారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఇంద్రసేనా రెడ్డి వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆర్గికల్ 370 రద్దు చారిత్య్రక నిర్ణయం..!మోదీ వల్ల దేశ ఖ్యాతి పెరిగిందన్న ఇంద్రసేనా రెడ్డి..!!
బీజేపి తీసుకున్న ఆర్గికల్ 370 రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం హాస్యాస్పదమని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. సుధీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంస్కరణలు తీసుకురాలేక పోయిందని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీని నడిపించే బాద్యతలు తీసుకోవడానికి మొన్నటి వరకూ ఎవరూ ముందుకు కూడా రాలేదని దేశంలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బాద్యతలు చేపట్టడానికి ఆ పార్టీలో ఎవ్వరూ ముందుకు రావడంలేదంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం అవుతోందని ఆయన ఎద్దేవా చేసారు.
బీజేపిలో పెద్ద ఎత్తున చేరికలుంటాయి..! వచ్చే ఎన్నికల్లో అదికారంలోకి వస్తామన్న మాజీ ఛీఫ్..!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపి తప్పకుండా ప్రభావం చూపిస్తుందని, ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపిలోకి వస్తామంటే కాదనే ప్రసక్తే లేదని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.ఈ నెల 18న హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఆ సభలో తెలంగాణ కు కాంగ్రెస్ కు సంబందించిన నేతలతో పాటు తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు కూడా బీజేపిలో చేరుతున్నారని తెలిపారు. అదికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన నేతలు కూడా బీజేపి పార్టీలోకి చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. తెలంగాణలో గులాబీ పార్టీ ప్రజలకు కల్పించిన భ్రమలు తొలిగిపోయే సమయం ఆసన్నమైందని, అందుకే ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో నాలుగు ఎంపి సీట్లు బీజేపి గెలుచుకోవడమే అందుకు ఉదాహరణ అని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.
టీఆర్ఎస్ వ్యాఖ్యలు అర్ధరహితం..! భవిష్యత్తులో ప్రభావం చూపేది బీజేపినే అన్న ఇంద్రసేనా..!!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బీజేపి పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయపడ్డారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన బీజేపి ఏదో ఊహించుకుంటోందన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. బీజేపి బలం అంతంత మాత్రంగా ఉంటే నిజామాబాద్ లో కవిత ఎందుకు ఓడిపోయిందని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ఎందుకు గెలిపించుకోలేక పోయారని ఆయన సూటిగా ప్రశ్రించారు. తెలంగాణలో ప్రజలు గులాబీ పార్టీకి తర్వలో మంచి గుణపాఠం చెబుతారని, టీఆర్ఎస్ పార్టీ వాపును చూసి బలుపనుకుంటోందని ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు.
టీఆర్ఎస్ నుంచి చేరికలుంటాయి..! చేతనైతే కేసీఆర్ నిలువరించుకోవాలన్న మాజీ అద్యక్షుడు..!!
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు. ఆగస్టు 15 నుండి తెలంగాణ ప్రభుత్వ పనితీరును చూస్తారని సీఎం చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. గత ఆరు సంవత్సరాలుగా పరిపాలన చేయకుండా గాడిద పళ్లు తోమారా అంటూ మండి పడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రశేఖర్ రావు బీజేపీ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఒక పక్క కేంద్ర సహాయం పొందుతూనే మరోపక్క బీజేపిని విమర్శించడం చంద్రశేఖర్ రావు విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. 18తారీఖున బీజేపి జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ జేపీ నడ్డా ముఖ్య అతిదిగా హాజరవుతున్న భారీ బహిరంగ సభలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా బీజేపిలో చేరిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.