పాలమూరు దత్తత గ్రామంలో సిబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ పర్యటన
మహబూబ్ నగర్/హైదరాబాద్: సిబిఐ మాజీ జెడీ లక్ష్మీ నారాయణ మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దమమందడి మండలం చిన్నమందడిలో పర్యటించారు. ఆయన చిన్నమందడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వందేమాతరం ఫౌండేషన్ తరఫున పాఠశాలకు ఫర్నీచర్, సిసి రోడ్లు, లైబ్రరీ ఏర్పాటు చేయించారు.
కాగా, పాలమూరు జిల్లా గ్రామాల పైన పలువురు దృష్టి పడింది. వలసలకు నిలయమైన మహబూబ్నగర్ జిల్లాలోని పలు గ్రామాలను సినీ నటులే కాకుండా ఇతరులు కూడా దత్తత తీసుకుంటున్నారు.
సినీ హీరో మహేష్ బాబు కొత్తూర్ మండలం సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోగా, సినీ నటుడు ప్రకాష్రాజ్ కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇటీవలే నటుడు సుమన్ కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
సుమన్... సుద్దపల్లి గ్రామస్థులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1,436 జనాభా కలిగిన సుద్దపల్లి గ్రామాన్ని సుమన్ దత్తత తీసుకోవడం పట్ల ఆ గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు నెలకొని ఉండడంతో సుమన్ దత్తత తీసుకోవడంతో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
వాటర్ గ్రిడ్ అవినీతిపై విచారణ చేయించాలి: శ్రవణ్
వాటర్ గ్రిడ్, సింగరేణి కొలువుల్లో జరిగిన అవినీతి పైన బహిరంగ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ మంగళవారం హైదరాబాదులో డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పాలన పైన ఆయన విరుచుకు పడ్డారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కారణమన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేయడం వల్లనే వరంగల్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. రాజయ్య చేసిన అవినీతి, అక్రమాలు ఏమిటో ఇప్పటి వరకు నిరూపించలేదన్నారు. టిఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రిపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణను చెల్లని రూపాయి అన్న మంత్రి కెటిఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.
టిఆర్ఎస్ పాలన అవినీతిమయం: మధుయాష్కీ
పద్దెనిమిది నెలల టిఆర్ఎస్ పాలన అవినీతిమయమని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. స్వయానా ముఖ్యమంత్రే అవినీతిలో కూరుకుపోయారని, వాటర్ గ్రిడ్, కమిషన్ల కాకతీయ, సింగరేణి ఉద్యోగ నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలన్నారు.