కోడలు మృతి కేసులో రాజయ్య, ఫ్యామిలికీ బెయిల్: రెండో భార్య సనకు నిరాకరణ
వరంగల్: కోటలు సారిక, ముగ్గురు మనుమల సజీవ దహనం కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్కు వరంగల్ న్యాయస్థానం గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారికి మూడు నెలల తర్వాత బెయిల్ వచ్చింది.
రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి శనివారం నాడు హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. రాజయ్య, కుటుంబ సభ్యులు ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండులో ఉన్నారు. కాగా, అనిల్ రెండో భార్య సనకు వరంగల్ కోర్టు బెయిల్ నిరాకరించింది.
వరంగల్ ఉప ఎన్నికల సమయంలో రాజయ్య ఇంట్లో కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజయ్య, కుటుంబ సభ్యులు అరెస్టై జైలులో ఉన్నారు. ఇప్పుడు రాజయ్యకు బెయిల్ వచ్చింది.