తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక పదవులు..వర్కింగ్ ప్రెసిడెంట్గా అజారుద్దీన్
ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పలువురికి కీలక పదవులను కట్టబెట్టింది. మరికొందరి అసంతృప్తులను బుజ్జగించేందుకు పదవులు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మధ్యే కాంగ్రెస్లో చేరిన సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు భారత మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.
అజారుద్దీన్తో పాటు బీఎం వినోద్ కుమార్, జాఫర్ జావేద్లను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇక జనరల్ సెక్రటరీలుగా ఎస్. జగదీశ్వర రావు, నగేష్ ముదిరాజ్, టి.నర్సారెడ్డి, మానవతా రాయ్, ఫహీమ్, కైలాష్, లక్ష్మారెడ్డి, క్రిశాంక్లను కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ నియమించారు. ఇక కార్యదర్శులుగా దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్ కుమార్, బాల లక్ష్మీలను నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.
తనకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన పదవిపై అజారుద్దీన్ స్పందించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినందుకు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. 18 ఏళ్ల తరువాత తనకు పెద్ద పోస్టింగ్ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. క్రికెట్లో ఉన్న సమయంలో భారత కెప్టెన్గా పెద్ద బాధ్యతలు నిర్వర్తించినట్లు గుర్తు చేసుకున్న అజారుద్దీన్ ఆ తర్వాత మళ్లీ ఇంతకాలానికి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎనలేని సేవలు చేసిందని కొనియాడిన అజారుద్దీన్..పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. క్రికెట్ ఆడేందుకు శక్తి లేదన్న అజ్జూభాయ్..కాంగ్రెస్ కోసం పనిచేసే శక్తి ఉందన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన అజారుద్దీన్...దేశవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీచేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఈ మణికట్టు మాంత్రికుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం తథ్యం అని జోస్యం చెప్పారు.