బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా, మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ బీజేపీలో చేరారు. వికారాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరుల సమక్షంలో పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్చుగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందన్న విషయం ఇప్పటికే రుజువైందని చెప్పారు.
టీఆర్ఎస్లో దళితులు, బీసీలకు గౌరవం, గుర్తింపు లేవని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీలో మాత్రమే సామాజిక న్యాయం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. వికారాబాద్ను జోగులాంబ జోన్ నుంచి తప్పించి హైదరాబాద్ జోన్లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. వికారాబాద్కు వైద్య కళాశాల తీసుకురావాలన్న హామీని బీజేపీ ద్వారా సాధిస్తామని చంద్రశేఖర్ అన్నారు. అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి ప్రతి హిందువు 10 రూపాయలైనా జమ చేయాలని అన్నారు.
గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందన్నారు. సర్పంచ్ని... కలెక్టర్ సస్పెండ్ చేసే జీవో తెచ్చిన కేసీఆర్..సీఎంను కూడా సీఎస్ సస్పెండ్ చేసే జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.