ఆ వ్యాఖ్యలకు క్షమాపణ, నా జీవితాన్ని బలిపెట్టా, వాళ్ళే టిడిపిని భ్రష్టు పట్టించారు: మోత్కుపల్లి
Recommended Video
హైదరాబాద్: . టిఆర్ఎస్లో టిడిపి విలీనం చేయాలని తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నర్సింహులు క్షమాపణ చెప్పారు.సరైన నాయకత్వం లేకపోవడంతోనే తెలంగాణలో టిడిపి తీవ్రంగా నష్టపోయిందని నర్సింహులు అన్నారు. టిటిడిపి సమావేశానికి తాను లేకుండా సమావేశం నిర్వహించడంపై తీవ్రంగా బాధపడుతున్నానని నర్సింహులు ప్రకటించారు.టిఆర్ఎస్తో విలీనం కాకుంటే పొత్తు ఉంటుందన్నారు. అయితే పొత్తు విషయమై చంద్రబాబునాయుడు నిర్ణయమే ఫైనల్ అని నర్సింహులు తేల్చి చెప్పారు.
టిడిపిని టిఆర్ఎస్లో విలీనం చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రెండు మాసాల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా హైద్రాబాద్లో జరిగిన పార్టీ సమావేశాలకు మోత్కుపల్లి నర్సింహులుకు సమాచారం ఇవ్వలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల సమావేశానికి, ముఖ్యుల సమావేశానికి నర్సింహులుకు ఆహ్వనం అందలేదు. దీనిపై నర్సింహులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మోత్కుపల్లి నర్సింహులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
విలీనం చేయాలని అన్నందుకు క్షమాపణ
టిఆర్ఎస్లో టిడిపిని విలీనం చేయాలని తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డవారందరికీ క్షమాపణ చెబుతున్నట్టుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. టిఆర్ఎస్తో విలీనం కాకుంటే పొత్తు ఉంటుందన్నారు. అయితే తెలంగాణలో ఏ పార్టీతో పొత్తుండాలనే విషయమై చంద్రబాబునాయుడు నిర్ణయమే ఫైనల్ అని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.టిఆర్ఎస్తో పొత్తు విషయంలో తాను మాట్లాడినదానిలో తప్పేమీ లేదన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు పొందినవారంతా టిఆర్ఎస్లో ఉన్నారని నర్సింహులు అభిప్రాయపడ్డారు.
రేవంత్రెడ్డి పార్టీకి నష్టం చేశారు
తెలంగాణలో పార్టీ నాయకత్వాన్ని చేపట్టినవారే పార్టీని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిన రోజునే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. పార్టీకి రేవంత్ రెడ్డి తీవ్రంగా నష్టం చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబునాయుడు నమ్మి పార్టీ బాధ్యతలను అప్పగిస్తే నమ్మకద్రోహం చేశారని చెప్పారు. ఓటుకు నోటు కేసుతో రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడుకు తలవొంపులు తెచ్చారని చెప్పారు.
చంద్రబాబుకు తమ్ముడిగా ఉంటా
ఎన్టీఆర్కు ఏ రకంగా ఉన్నానో, చంద్రబాబునాయుడికి కూడ అలాగే ఉంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.ఎన్టీఆర్ దగ్గర ఎలా పని చేశానో చంద్రబాబు దగ్గర కూడా అలాగే ఎంతో నమ్మకంగా చేస్తున్నాను. తెలంగాణ వాదం వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తరఫున నేను తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పట్లో చంద్రబాబుపై చాలామంది అనేక రకాల విమర్శలు చేశారని మోత్కుపల్లి నర్సింహులు గుర్తు చేశారు.
జీవితాన్ని బలిపెట్టుకొన్నా
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చంద్రబాబునాయుడుకు అనుకూలంగా మాట్లాడినందుకు తనపై దాడి చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించి నన్ను చంపాలనుకున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు. నా జీవితం బలిచేసి చంద్రబాబు పక్కన నిలబడ్డా. అందుకు గర్విస్తున్నట్టు చెప్పారు.
రమణ నాయకత్వం సరిగా లేదు
టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వం సరిగా లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. రమణ నాయకత్వం సరిగా లేని కారణంగానే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడారని చెప్పారు. తాను చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. ఇతరుల నాయకత్వంలో పనిచేయబోనని నర్సింహులు చెప్పారు.