కెసిఆర్ సర్కార్ను కూల్చే కుట్ర, ఎన్టీఆర్ మృతికి కూడ, ఓడించండి: బాబుపై మోత్కుపల్లి సంచలనం
హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబునాయుడు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబునాయుడు వల్లే ఎన్టీఆర్ మరణించారని ఆయన చెప్పారు.తన రాజకీయ జీవితాన్ని బలి తీసుకోవడానికి కుట్రలకు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కెసిఆర్ ను మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైద్రాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నర్సింహులు ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఏపీలో బాబుకు ఓటెయొద్దని కోరారు. అవసరమైతే తాను ఏపీలో కూడ రధయాత్ర చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టారని బాబుపై నర్సింహులు ఆరోపణలు చేశారు. తీవ్ర బావోద్వేగానికి గురైన నర్సింహులు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
ప్రజల మద్దతుతో తెలంగాణలో ఎన్నికైన కెసిఆర్ ప్రభుత్వాన్ని కూలగట్టేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడులు ఆనాడు చేపిన కుట్రను కెసిఆర్ తెలివిగా బట్టబయలు చేశారని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని కెసిఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారని నర్సింహులు ఆరోపించారు.ఓటుకు నోటుకు కేసులో చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ను ఆయన కొనియాడారు.
బాబు కుట్రకు ఎన్టీఆర్ బలి
ఎన్టీఆర్ కూడ కుట్రలకు బలయ్యారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ చావుకు కూడ చంద్రబాబునాయుడు కారణమని నర్సింహులు విమర్శించారు.ఎన్టీఆర్ నుండి పార్టీ జెండాను చంద్రబాబునాయుడు లాక్కొన్నారని ఆయన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ లు స్వంతంగా తమ జెండాను ఏర్పాటు చేసుకొన్నారని, వాళ్ళు మొగ్గాళ్ళన్నారు. కానీ, ఎన్టీఆర్ నుండి టిడిపి జెండాను లాక్కొన్నారని నర్సింహులు ఆరోపించారు.
చరిత్రలో బాబుకు నల్లపేజీ
రాష్ట్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబునాయుడుకు నల్లపేజీ ఉంటుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ వల్ల తనలాంటి పేదోళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు. మాల, మాదిగల మధ్య బాబు చిచ్చుపెట్టారని ఆయన ఆరోపించారు. కాపులు, బీసీల మధ్య కూడ చిచ్చు పెట్టారని నర్సింహులు ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే ఏపీలో కూడ తాను రధయాత్ర చేస్తానని ఆయన హెచ్చరించారు.
రూ.100 కోట్లకు రాజ్యసభ సీటు విక్రయం
రాజ్యసభ సీటును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రూ.100 కోట్లకు అమ్ముకొన్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో కూడ వందల కోట్లను కమిషన్లుగా తీసుకొన్నారని ఆయన ఆరోపించారు. హోదాపై యూటర్న్ తీసుకొని ఇప్పుడు హోదా గురించి బాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడును ప్రజలు పాతాళంలోకి తొక్కేందుకు సిద్దంగా ఉన్నారని నర్సింహులు చెప్పారు. బాబుకు ఓటు వేయొద్దని ఆయన కోరారు.
నందమూరి ఫ్యామిలీకి పగ్గాలివ్వాలి
టిడిపి నాయకత్వ బాధ్యతలను నందమూరి కుటుంబానికి ఇవ్వాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ నుండి పార్టీని బాబు లాక్కొన్నారని ఆయన ఆరోపణలు చేశారు. నందమూరి కుటుంబానికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని ఆయన కోరారు.