బిజెపికి నాగం రాజీనామా: అమిత్షాకు లేఖ, కాంగ్రెస్లోకేనా?
హైదరాబాద్: బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గురువారం నాడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు తన రాజీనామా లేఖను పంపారు. త్వరలోనే నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై తాను పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు.
అయితే తనకు బిజెపి నాయకత్వం నుండి ఏ మాత్రం సహకారం లభించలేదన్నారు. దీనితో పాటు ఇతర కొన్ని కారణాలతో తాను బిజెపికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది తాను త్వరలోనే ప్రకటించనున్నట్టు ఆయన చెప్పారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి సుధీర్ఘకాలం పాటు నాగం జనార్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. టిడిపిలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2012లో తెలంగాణ విషయంలో నాగం జనార్ధన్ రెడ్డి టిడిపికి గుడ్బై చెప్పారు. ఆ తర్వాత స్వంతంగా తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేసుకొన్నారు.
ఆ తర్వాత బిజెపిలో చేరారు. 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి నాగం జనార్ధన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే కొంత కాలంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం తీరుపై నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
గత నెలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో వైపు నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.