మాజీ మంత్రి రెడ్యా నాయక్ కు పెద్ద కష్టం ... జూనియర్ ను మంత్రిగా అంగీకరించాల్సిన అగత్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనో ఓ సీనియర్ మాజీ మంత్రి. డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన ఆ నేత స్థానికంగా మంచి పట్టున్న ఎమ్మెల్యే. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడైన ఆయనను పక్కన పెట్టి జూనియర్ కు మంత్రిగా అవకాశం ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్ . అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. దీంతో అలక వహించిన సదరు సీనియర్ మాజీ మంత్రి, కెసిఆర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
సత్యవతికి మంత్రిగా అవకాశం ఇవ్వటంతో రెడ్యా నాయక్ షాక్
డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఆరు సార్లు విజయకేతనం ఎగురవేసిన రెడ్యా నాయక్ కు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. రాజకీయాల్లో సీనియర్ అయిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టిన సీఎం కేసీఆర్, సామాజిక సమీకరణాల నేపథ్యంలో, మహిళా కోటాలో స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో సత్యవతి రాథోడ్ కు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఇక అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.
మంత్రిగా పనిచేసిన సీనియర్ గా మంత్రి పదవి వస్తుందనుకున్న రెడ్యా ..
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రెడ్యా నాయక్ కేసీఆర్ క్యాబినెట్ లో స్థానం లభిస్తుందని, మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా సత్యవతి రాథోడ్ కు మంత్రిగా అవకాశం లభించింది. దీంతో రెడ్యానాయక్ కినుక వహించినట్లు గా రాజకీయ వర్గాల్లో ప్రచారంజరుగుతోంది. ఇక అత్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు బాధ అన్నచందంగా ప్రస్తుతం ఆయన పరిస్థితి తయారైంది. ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థి, తనకంటే రాజకీయాల్లో జూనియర్ అయిన సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఇచ్చి, తనకు అవకాశం కల్పించకపోవడంతో రెడ్యా నాయక్ లబోదిబోమంటున్నారు.
సత్యవతి మంత్రి కావటంతో అలిగిన రెడ్యా
రెడ్యా నాయక్ తన సన్నిహితుల వద్ద తన బాధను చెప్పుకొని వాపోతున్నారు. తనకంటే జూనియర్ అయిన సత్యవతికి మంత్రి పదవి రావడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికంగా పట్టున్న తనపై ఇప్పుడు మంత్రిగా సత్యవతి రాథోడ్ పెత్తనం చెలాయిస్తుందా అని తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అందుకే మంత్రిగా సత్యవతి రాథోడ్ పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహబూబాబాద్ నుంచి అందరూ వెళ్లారు కానీ రెడ్యానాయక్ మాత్రం వెళ్లలేదు. దీంతో ఆయన అలిగారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
రంగంలోకి కేటీఆర్ .. రెడ్యాకు ఇవ్వని కారణం ఇదే
అలిగిన సీనియర్ నేత , మాజీ మంత్రి రెడ్యానాయక్ ను బుజ్జగించటానికి కేటీఆర్ రంగంలోకి దిగారు. అసలు కారణం చెప్పి రెడ్యాకు సముచిత స్థానం ఇచ్చామని వివరించారు. రెడ్యా నాయక్ కు మంత్రి పదవి ఇవ్వక పోవడానికి గల కారణాలను ఆయన రెడ్యా నాయక్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో సమీకరణాలను బట్టీ రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కుమార్తె కవిత మహబూబాబాద్ నుండి ఎంపీగా గెలుపొందారు. ఒకే కుటుంబానికి రెండు పదవులు దక్కాయి .
జూనియర్ ను మంత్రిగా అంగీకరించాల్సి వస్తున్న బాధలో రెడ్యా
ఇక దీంతో మంత్రిగా కూడా రెడ్యా నాయక్ కు అవకాశం ఇస్తే బాగోదనే ఉద్దేశంతోనే టిఆర్ఎస్ అధిష్టానం మహిళకు స్థానం కల్పించినట్లు గా ఉంటుందని, అదేవిధంగా సామాజిక సమీకరణాలను కూడా పాటించినట్లు గా ఉంటుందని సత్యవతి రాథోడ్ కు అవకాశం ఇచ్చారు. ఇక దీంతో కనీసం నామినేటెడ్ పదవి కూడా రెడ్యా నాయక్ కు దొరికే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజకీయాల్లో ప్రత్యర్థిగా తలపడిన, జూనియర్ అయిన సత్యవతి రాథోడ్ ను మంత్రిగా అంగీకరించాల్సిన పరిస్థితి రెడ్యా కు వచ్చింది.