లిస్ట్ సిద్ధమవుతోంది, అధికారంలోకి రాగానే భరతం: కలెక్టర్ కంటతడి, సర్వేపై కేసు
హైదరాబాద్: అధికారిక కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారంటూ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కూకట్పల్లి తహసీల్దారు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా మూసాపేట వై జంక్షన్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మేడ్చల్ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదంటూ సర్వే సత్యనారాయణ మేడ్చల్ - మల్కాజిగిరి కలెక్టర్ ఎంవీ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ కంటతడి పెట్టారు.
తనను కార్యక్రమానికి ఆహ్వానించలేదంటూ సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసి, కలెక్టర్ను హెచ్చరించారు. దీంతో సభలో కలకలం చెలరేగింది. స్థానిక కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ పరిణామాలతో కలెక్టర్ మనస్తాపానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదంటూ సర్వే.. కలెక్టర్ను వేదిక పైనే నిలదీశారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపినట్లు కలెక్టర్ చెప్పారు. సర్వే తీవ్ర స్వరంతో స్పందిస్తూ.. నాతో వాదించొద్దంటూ హెచ్చరించారు. ఎవరెవరు ఏమిటనే జాబితాను తయారు చేస్తున్నానని, అధికారంలోకి రాగానే వారి భరతం పడతామన్నారు.
దీంతో వేదికపైనే ఉన్న దళితుల ఐక్యవేదిక అధికారి ప్రతినిధి కట్టా నర్సింగ రావు, ఎమ్మెల్యే కృష్ణారావు రాజకీయాలు మాట్లాడొద్దని వారించారు. ఆయన రాజకీయ వాదనను కలెక్టర్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యేలు తనను అవమానపరిచారని, దళితుడినైనందునే తనకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదని సర్వే ఉద్వేగంతో అన్నారు.
దీంతో సభ అర్ధంతరంగా నిలిచిపోయింది. సర్వే తీరును దళితుల ఐక్యవేదిక అధ్యక్షులు నపారి చంద్రశేఖర్ మీడియా సమావేశంలో ఖండించారు. సర్వేను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి, అధ్యక్షుడు గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు.