మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కాంగ్రెస్లో చేరుతారా?
సిర్పూర్ కాగజ్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య టిఆర్ఎస్ ను వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర సందర్భంగా సమ్మయ్య టిఆర్ఎస్ను వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై సమ్మయ్య మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న ఎన్నికల్లో సిర్పూర్ నుండి టిక్కెట్టు ఇస్తామని హమీ లభించడంతో సమ్మయ్య కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
2014 ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కావేటీ సమ్మయ్య బిఎస్పీ అభ్యర్ధి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. బిఎస్పీ ఎమ్మెల్యే కోనప్ప టిఆర్ఎస్లో చేరారు. దీంతో సమ్మయ్య టిఆర్ఎస్లో ఎమ్మెల్యే వర్గానికి, తన వర్గానికి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.
ఈ తరుణంలో పార్టీ నాయకత్వం తీరుపై కూడ సమ్మయ్య కొంత అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోందని సమాచారం. ఈ విషయమై ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మహేశ్వర్ రెడ్డి, గడ్డం అరవింద్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కావేటి సమ్మయ్యతో చర్చలు జరిపారని సమాచారం.
కావేటి సమ్మయ్యతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ ఫోన్లో చర్చించారని ప్రచారం సాగుతోంది. మే 13వ తేది నుండి ఆదిలాబాద్ జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్రను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సమ్మయ్యకు టిక్కెట్టు ఇస్తామని హమీ ఇచ్చినట్టు కూడ ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై తన అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొంటానని సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై సమ్మయ్య ఏ నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.