కాంగ్రెస్కు షాక్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఇక అసలుసిసలు పోరాటం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ తదితరులున్నారు.
Recommended Video
మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో..
బీజేపీలో చేరిక నేపథ్యంలో కూన శ్రీశైలం గౌడ్ అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలను తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, 2009లో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానంటూ చెప్పారు కూన శ్రీశైలం.
కాంగ్రెస్ పూర్తిగా విఫలం..
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు కూన శ్రీశైలం తెలిపారు. మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. గత ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోయిందని ధ్వజమెత్తారు.
అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
ఈ పరిణామాలన్నీచూసిన ప్రజలు కూడా టీఆర్ఎస్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాడలేదనే నిర్ణయానికి వచ్చారన్నారు. ఇందుకు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశానని కూన శ్రీశైలం తెలిపారు.
బీజేపీతోనే అసలుసిసలు పోరాటం
అంతేగాక, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమనే నిర్ణయానికి వచ్చినట్లు కూన స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా టీఆర్ఎస్పై అసలుసిసలు పోరాటం చేస్తున్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేడ్చల్ డీసీసీ అధ్యక్ష పదవితోపాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరడం గమనార్హం. మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాలతో బీజేపీ కొత్త ఉత్సాహంతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే.