ఏటీఎంకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పూజలు, అప్పుడే మన చేతికి కొత్త రూ.500 నోట్లు!
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు చిన్న నోట్లు లేక ఇబ్బందులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం నాడు ఏటీఎంకు పూజలు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం నాడు ఏటీఎంకు పూజలు చేశారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు చిన్న నోట్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొత్తపేటలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎంకు పూజలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్రం తొందరపాటుతో తీసుకున్నదన్నారు. కేవలం పేరు, ప్రతిష్ఠల కోసం ఇన్నేళ్లలో ఎవరూ చేయని పని తాము చేశామని చెప్పుకోవడానికే ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
ప్రజలకు సరిపడా చిల్లర నోట్లు అందుబాటులో కి తీసుకు రాకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడాల్సి వస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను సమీక్షించకుండా నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోటుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, వెంటనే ఆ నోటును రద్దు చేసి రూ.500 నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో రూ.500 నోట్లు!
నోట్ల రద్దు అనంతరం.. కేవలం రూ.2వేల కొత్త నోటు మాత్రమే ఏటీఎంల నుంచి వస్తోంది. కొత్త రూ.500 నోటు, లేదా రూ.100 నోట్లు కానీ రావడం లేదు. దీంతో ఆ రెండు వేల నోటును తీసుకున్నామని సంతోషం ఉన్నా, చిల్లర దొరకడం లేదనే బాధ సామాన్యుడిని వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా ఏటీఎంల్లో కొత్త 500, 2000 నోట్లను నింపేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది.
రోజుకు 10వేల ఏటీఎంల్లో ఈ కొత్త నోట్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు. దీంతో మరో పది రోజుల్లో ఏటీఎంల్లో 2వేల నోట్లతో పాటు రూ.500 నోట్లు అందుబాటులోకి రానున్నాయని అంటున్నారు. అంతా సవ్యంగా జరిగితో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలలోని ఏటీఎంలలో రూ.500 నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. నవంబర్ నెల జీతాలపై నోట్ల రద్దు ప్రభావం పడకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
సీపీఎం ధర్నా
కేంద్రం పెద్ద నోట్లు రద్దుచేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన చేపట్టింది. మోడీ ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదన్నారు.
నల్లకుబేరుల మాట దేవుడెరుగు సామాన్యులు మాత్రం నడివీధి పాలయ్యారన్నారు. మోడీ ప్రకటన చేసినప్పుడు పరిస్థితి రెండు మూడు రోజుల్లో చక్కబడుతుందన్నారని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, ఇప్పటిదాకా ఇబ్బందులు పోలేదన్నారు. ఈ సందర్భంగా వారు బ్యాంకు అధికారులకు వినతిపత్రం అందించారు.