టీఆర్ఎస్కు షాక్ : మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ రాజీనామా.. ప్రభుత్వానికి హెచ్చరిక
మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్టీయూ) సభ్యుల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు,మిగతా పీఆర్టీయూ ఎమ్మెల్సీలతోనూ రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మంగళవారం(ఫిబ్రవరి 9) యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద చేపట్టిన పీఆర్టీయూ మహాధర్నాలో పూల రవీందర్ మాట్లాడారు.
దాదాపు 31 ఒక్క నెలలపాటు కాలయాపన చేసిన పీఆర్సీ కమిటీ.. ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లే నివేదిక ఇచ్చిందని రవీందర్ విమర్శించారు. 'మనకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదు, పీఆర్టీయూ ముఖ్యం. పీఆర్టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం.' అని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే 45శాతం పీఆర్సీని,హెచ్ఆర్ఏ తగ్గించకుండా వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికలో శాస్త్రీయత లోపించిందని రవీందర్ విమర్శించారు. ఆ నివేదికను పక్కన బెట్టి అత్యుత్తమమైన పీఆర్సీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని కోరారు.పదోన్నతులు కల్పించడంతో పాటు బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రతీ పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేసి హైదరాబాద్లో పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇటీవల బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 7శాతం ఫిట్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ను 45శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.