గ్రేటర్ దెబ్బ: కాంగ్రెస్లో మరో వికెట్ -అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా -బీజేపీలో చేరికపై క్లారిటీ..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు కొనసాగుతున్నాయి. మొత్తం 150 డివిజన్లకుగానూ కేవలం రెండు చోట్ల (ఏఎస్ రావు నర్, ఉప్పల్ డివిజన్లలో) మాత్రమే గెలిచిన గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఓటింగ్ శాతం కూడా భారీగా తగ్గిపోయింది. ఎన్నికల ఫలితాలొచ్చిన రోజే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయగా, పీసీసీ కోశాధికారి పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి గూడురు నారాయణ రెడ్డి సోమవారం ఇస్తిఫా ఇచ్చేశారు. తాజాగా మరో బడా నేత కీలక పదవిని వదులుకున్నారు..
గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గుడ్ బై
గ్రేటర్ ఎన్నికలకు ముందే మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ రవి కుమార్ యాదవ్ బీజేపీలో చేరిపోగా, ఫలితాల తర్వాత ఉత్తమ్, గూడురులు పార్టీ పదవులకు రాజీనామా చేయగా, స్టార్ మహిళా నేత విజయశాంతి కాషాయ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా ప్రకటించారు. గ్రేటర్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గురువారం అంజన్ స్వయంగా మీడియాకు చెప్పారు. అంతేకాదు..
కొడుకుతోపాటు అంజన్ బీజేపీలోకి అంటూ
గతంలో రెండు సార్లు సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసిన అంజన్ కుమార్, గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండి, కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కు ముషీరాబాద్ టికెట్ ఇప్పించుకున్నారు. నాటి ఎన్నికల్లో అనిల్ ఓడిపోయారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల సందర్భంలో సొంత పార్టీపై అంజన్ చిర్రుబుర్రులాడారు. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడినైన తనకు చెప్పకుండా అభ్యర్థుల ఎంపిక, ప్రచార కమిటీలు వేయడాన్ని ఆయన బాహాటంగా నిరసించారు. ఒక దశలో కొడుకు అనిత్ తో కలిసి అంజన్ యాదవ్ బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తాను కాషాయ తీర్థం పుచ్చుకోవడంలేదని ఆయన స్పష్టం చేశారు. అసలు..
పీసీసీ రేసు కోసమే రాజీనామా..
గ్రేటర్ కాంగ్రెస్ పదవికి తన రాజీనామా బీజేపీలో చేరేందుకు కాదని అంజన్ కుండబద్దలు కొట్టారు. టీపీసీసీ అధ్యక్షునిగా ప్రమోషన్ కోసమే గ్రేటర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. గ్రేటర్ చీఫ్ గా కొనసాగుతూ, పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడటం సాధ్యం కాదని, అందుకే సిటీ చీఫ్ పదవిని వదిలేసి రాష్ట్ర పార్టీ చీఫ్ స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశానని అంజన్ కుమార్ యాదవ్ వివరించారు. ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ చీఫ్ పీఠం కోసం కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ నెలకొంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటి రెడ్డిలు ఫ్రంట్ రన్నర్ లుగా ఉన్నారు.
Recommended Video