వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు అమృత, ప్రణయ్ ఫ్యామిలీని పరామర్శించిన మాజీ ఎంపీ
మిర్యాలగూడ: తన భర్త ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అమృత విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు ఆమె బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి సీఐని కలిసింది.
మారుతీరావు ఇంట్లో సోదాలు, ప్రణయ్ కేసులో నేతలకు ఆర్యవైశ్య సంఘం వార్నింగ్
చట్టపరమైన చర్యలు తీసుకోండి
తమను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయని, అలాంటి ప్రచారాలు ఆపేయాలని కోరినా మార్పు లేదని అమృత చెప్పింది. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
పోలీసుల చేతికి త్వరలో వివరాలు
తనపై వస్తున్న కామెంట్లకు సంబంధించి అమృత త్వరలో పోలీసులకు వివరాలు అందించనున్నారని తెలుస్తోంది. కాగా, ఇటీవల అమృత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తల్లిదండ్రులు తమ సుఖం కోసం పిల్లలను కంటారని, వారిపై ప్రేమతో కారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీటిపై కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి.
ప్రణయ్ కుటుంబానికి అండగా ఉంటాం
బుధవారం మిర్యాలగూడలోని ప్రణయ్ కుటుంబాన్ని మాజీ ఎంపీ తిరుమావలవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రణయ్ చట్టాన్ని తీసుకు వచ్చే వరకు పోరాడుతామని చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు హత్య చేయడం సరికాదన్నారు. ప్రణయ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
సమష్టిగా పోరాటం
ప్రణయ్ చట్టం కోసం అంతా సమష్టిగా పోరాటాలు సాగిస్తామని మాజీ ఎంపీ తిరుమావలవన్ అన్నారు. ఈ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని చెప్పారు. ఆయన ప్రణయ్ కుటుంబానికి రూ.50వేల చెక్కు అందించారు. ప్రణయ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ తిరుమావలవన్... విముక్త తమిళనాడు చిరుతల కక్షి పార్టీ జాతీయ అధ్యక్షులు.