లగడపాటి సర్వే ఫేక్! కూటమికి ఎక్కువ సీట్ల వెనుక అసలు కారణం ఇదీ: మరో కారణం చెప్పిన వివేక్
తిరుపతి: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ సర్వే పైన మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత జి వివేక్ సోమవారం స్పందించారు. ఆయన తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాకూటమి గెలుస్తుందన్న లగడపాటికి గట్టి కౌంటర్ ఇచ్చారు. లగడపాటి సర్వే తికమకగా ఉందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 ఎన్నికల్లో తాను లక్ష ఓట్లతో ఓడిపోతున్నానని, అదే సమయంలో ఆయన (లగడపాటి) లక్ష మెజార్టీతో గెలుస్తాడని విమానంలో కలిసి చెప్పాడని అన్నారు. కానీ తాను 50 వేల మెజార్టీతో, లగడపాటి స్వల్ప మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు.
ఎగ్జిట్ పోల్ సర్వేలను విశ్లేషిస్తే తెరాసకు ఇబ్బందులు తప్పవా?: ఈ రెండు సర్వేలు ఏం చేప్పాయంటే?
ఏదో ఒకసారి కరెక్ట్ అయినంత మాత్రాన
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రాబోతుందని జీ వివేక్ చెప్పారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 2009లో తనకు చెప్పిన వాటి ద్వారానే ఆయన సర్వేలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలని చెప్పారు. ఏదో ఒక్కసారి కరెక్ట్ అయిందని భావించి ధీమాగా ఉంటే, నా సర్వేనే కరెక్ట్ అనుకోవడం ఏమాత్రం సరికాదని చెప్పారు.
లగడపాటి కూటమి అనుకూల సర్వే వెనుక ఇదీ!
లగడపాటి సర్వేను తాను అంగీకరించడం లేదని వివేక్ చెప్పారు. కచ్చితంగా తెరాస ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా వివేక్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని లగడపాటి ఇదివరకే చెప్పారు. కానీ ఆయన మహాకూటమి తరఫున విజయవాడ సీటుపై ఆశలు పెట్టుకొని, తెలంగాణలో వారికి పాజిటివ్ సర్వే ఇచ్చి ఉంటారని తాను భావిస్తున్నాని చెప్పడం గమనార్హం. తెరాస మళ్లీ వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని వివేక్ చెప్పారు.
తెరాస నేతల నిప్పులు
లగడపాటి సర్వే పైన టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. రెండు రోజుల క్రితం ఎంపీ వినోద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి సర్వేలన్నీ పచ్చి బూటకమన్నారు. తెలంగాణ రాష్ట్రం రాదని గతంలో లగడపాటి చెప్పినా తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలను గందరగోళం చేయడానికి చంద్రబాబుతో కలిసి లగడపాటి సర్వేల పేరుతో ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని బలమైన రాజకీయ పార్టీ పరిపాలించకూడదన్న ఉద్దేశంతో కుట్రలు చేస్తున్నారని చెప్పారు. జై తెలంగాణ నినాదాలిస్తే సరిపోదని, కుటిలరాజకీయాలు మానుకోవాలన్నారు.
భిన్నంగా లగడపాటి సర్వే
కాగా, జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ తెరాస కాస్త కష్టంగా గట్టెక్కే అవకాశాలున్నాయని వెల్లడించాయి. 55 నుంచి 65 సీట్లు వస్తాయని చెప్పాయి. లగడపాటి మాత్రం తెరాసకు 25 నుంచి 45 సీట్లు వస్తాయని, మహాకూటమికి 55 నుంచి 75 సీట్లు వస్తాయని చెప్పారు. దీనిపై తెరాస నేతలు మండిపడుతున్నారు.