నేడు బీఆర్ఎస్ లో మాజీ ముఖ్యమంత్రి ఎంట్రీ..!!
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు.
భారత రాష్ట్ర సమితి లో చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన సీఎం కేసీఆర్..ఫిబ్రవరి 5న నాందేడ్ ల.. అదే నెల 17న హైదరాబాద్ లో వరుస సభలను నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో వచ్చే వారం ఏపీలో పర్యటనకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే పార్టీలో ముఖ్య నేతల చేరికలు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కేసీఆర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ముఖ్య నేతలు బీఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్దమైంది.
ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఆయనతోపాటు ఒడిశాలోని కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి, గిరిధర్ గమాంగ్ తనయుడు శిశిర్ గమాంగ్ సహ మరి కొందరు నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు. గమాంగ్ 1999లో ఓవైపు ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీగానూ ఒడిశా ముఖ్యమంత్రిగానూ ఒకే సమయంలో వ్యవహరించారు.
వాజపేయి ప్రభుత్వం విశ్వాస పరీక్ష వేళ గమాంగ్ ఓటు కీలకమైంది. ప్రభుత్వం పడిపోయింది. ఆ సమయంలో గమాంగ్ దేశ వ్యాప్త చర్చకు కారణమయ్యారు. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అప్పుడే ఆయనకు ఒడిశా బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ ప్రతిపాదించినట్లు సమాచారం.
కాంగ్రెస్, బీజేపీలో పని చేసిన గమాంగ్ తమ పార్టీలో చేరటం ద్వారా ఒడిశాలో పార్టీ బలం పెరుగుతుందని కేసీఆర్ అంచనాగా కనిపిస్తోంది. 9 సార్లు పార్లమెంట్ కు గమాంగ్ ప్రాతినిధ్యం వహించారు. 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. బీజేపీకి రాజీనామా చేసిన గమాంగ్ ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరికతో రాజకీయంగా కొత్త అడుగు వేస్తున్నారు.
ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ 13వ తరం వారసుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పాలనను ఆయన అభినందించారు. నాందేడ్ లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభ గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. నాందేడ్ సభలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు.