నయీం కేసులో కొత్త కోణం: 4రోజులుగా రహస్యంగా మాజీ డీఎస్పీ విచారణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎన్నో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, గతంలో భువనగిరి డిఎస్పీగా పని చేసిన మాజీ అధికారిని ఒకరిని సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు విచారించారని తెలుస్తోంది.
సదరు అధికారికి నయీంతో సంబంధాలు ఉన్నట్లుగా సిట్ అనుమానిస్తోంది. అతనిని గత నాలుగు రోజులుగా విచారిస్తున్నారని తెలుస్తోంది. నయీంతో సంబంధాలున్నాయని అనుమానం కలగడంతో, అతనిని అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది.
సదరు అధికారి మాధవ రెడ్డి హత్య సమయంలో డీఎస్పీగా పని చేశారని తెలుస్తోంది. అనంతరం కాలంలో అతను ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో గ్యాంగ్ స్టర్ నయీం పోలీసుల కాల్పుల్లో కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇద్దరు నయీం అనుచరుల అరెస్ట్
కరీంనగర్ జిల్లా కోరుట్ల బీడీ వ్యాపారిని బెదిరించిన కేసులో ఇద్దరు నయం అనుచరులు అరెస్టయ్యారు. సుధాకర్, శ్రీధర్ రాజులను పోలీసులు అరెస్టు చేసి మెట్పల్లి కోర్టులో హాజరుపరిచారు.