చనిపోయిన తల్లిని చూడనివ్వలేదు - ప్రొఫెసర్ సాయిబాబాపై సర్కారు కాఠిన్యం
ఉరిశిక్ష పడిన ఖైదీకి సైతం చివరి కోరిక తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విషయంలో మాత్రం సర్కారు అతి కఠినంగా వ్యవహరించింది. క్యాన్సర్ తో చనిపోయిన తల్లిని చివరిసారిగా కనీసం వీడియోలోనైనా చూపండంటూ లాయర్లు చేసిన వినతిని జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో కొడుకును ఒక్కసారి చూడాలన్న చివరి కోరిక తీరకుండానే ఆ తల్లి అత్యక్రియలు ముగిశాయి.
అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే - ముందుగా 'హనుమాన్ గధీ'కి మోదీ.. కరోనా కట్టడికీ పూజలు..
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తల్లి గోకరకొండ సూర్యావతి(74) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం నాగపూర్ జైలులో ఉన్న తనయుడు సాయిబాబాకు ఈ విషయాన్ని చేరవేసేందుకు కుటుంబీకులు, లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చివరి దశలో ఉన్న తల్లిని ఒక్కసారైనా చూసేందుకు అవకాశం కల్పించాలంటూ ప్రొఫెసర్ సాయిబాబా చేసిన రిక్వెస్టును నాగపూర్ హైకోర్టు బెంచ్ నాలుగు రోజుల కిందట తిరస్కరించింది. ఈలోపే వ్యాధి తీవ్రతరం కావడంతో సాయిబాబా తల్లి సూర్యవతి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయనకు చేరవేయాలని, కనీసం వీడియో ద్వారానైనా అంత్యక్రియలు చూసేందుకు అవకాశం కల్పించాలని కోరగా, అందుకు నాగపూర్ జైలు అధికార వర్గాలు నిరాకరించాయని ప్రొఫెసర్ తరఫు న్యాయవాది ఆకాశ్ సరోద్ మీడియాకు తెలిపారు. దీంతో శనివారమే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకును చూడాలన్న ఆమె చివరి కోరికను తీర్చలేకపోయానంటూ సాయిబాబ సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు.
నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద నమోదైన కేసుల్లో విచారణ అనంతరం ప్రొఫెసర్ సాయిబాబాకు నాగపూర్ హైకోర్టు బెంచ్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా శిక్షపడింది. 2017 మార్చి నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. 90 శాతం వికాలాంగుడైన ప్రొఫెసర్ ను మానవతా దృక్ఫథంతోనైనా విడిచిపెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అమిత్ షా కు కరోనా పాజిటివ్ - ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి - కీలక సందేశం..